బైక్ను ఢీకొన్న ఇసుక లారీ
ABN , First Publish Date - 2020-12-29T07:59:23+05:30 IST
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని మంజీర నదిపై బీర్కూరు, బాన్సువాడ, బిచ్కుంద మండలాల పరిధిలో చెక్డ్యాంల నిర్మాణం
బైక్పై వ్యక్తికి కాలు విరిగి తీవ్రగాయాలు
లారీకి నిప్పు .. మరో తొమ్మిది లారీల అద్దాలు ధ్వంసం
కామారెడ్డి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి)/బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని మంజీర నదిపై బీర్కూరు, బాన్సువాడ, బిచ్కుంద మండలాల పరిధిలో చెక్డ్యాంల నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణాలలో భాగంగా మంజీర నదిలో ఇసుక రీచ్లకు ప్రభుత్వం టీఎ్సఎండీసీ ద్వారా అనుమతులు ఇచ్చింది.. రోజూ బిచ్కుంద మండల కేంద్రం మీదుగా వందల లారీలు, టిప్పర్ల ద్వారా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సోమవారం ఓ ఇసుక లారీ బిచ్కుంద మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బైక్పై వెళ్తున్న గోపన్పల్లి గ్రామానికి చెందిన విజయ్ని ఢీకొంది. విజయ్ కుడి కాలుపై నుంచి లారీ దూసుకెళ్లడంతో అతడి కాలు విరిగిపోయింది. తీవ్రగాయాలైన బాధితుడిని స్థానికులు అంబులెన్స్లో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామస్థులు ప్రమాదానికి కారణమైన ఇసుక లారీ అద్దాలు ధ్వంసం చేసి నిప్పంటించారు. మరో 9 ఇసుక లారీలను సైతం నిలిపివేసి వాటి అద్దాలను పగులగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు.