ఇసుక మాఫియా దౌర్జన్యం

ABN , First Publish Date - 2020-12-13T07:46:07+05:30 IST

అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న పోలీసులు, గ్రామస్థులపై ఇసుక మాఫియా గూండాలు దాడిచేశారు. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి సమీపంలోని బిక్కవాగు నుంచి శుక్రవారం అర్ధరాత్రి రాజన్న

ఇసుక మాఫియా దౌర్జన్యం

 50 ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా

 అడ్డుకున్న పోలీసులు, గ్రామస్థులపై దాడి

గన్నేరువరం, డిసెంబరు 12: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న పోలీసులు, గ్రామస్థులపై ఇసుక మాఫియా గూండాలు దాడిచేశారు. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి సమీపంలోని బిక్కవాగు నుంచి శుక్రవారం అర్ధరాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు 50 ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.


అదే సమయంలో గన్నేరువరం ఎస్‌ఐ ఆవుల తిరుపతి పెట్రోలింగ్‌ చేస్తూ వాగు వద్దకు చేరుకున్నారు. గమనించిన డ్రైవర్లు ట్రాక్టర్లను అక్కడే వదిలేసి సమీపంలోని చెట్లలోకి వెళ్లారు. ఆ ట్రాక్టర్లని పోలీ్‌సస్టేషన్‌కు తరలించడానికి సహాయం చేయాలని చొక్కారావుపల్లి సర్పంచ్‌ ముస్కు కరుణాకర్‌రెడ్డికి, ఉపసర్పంచ్‌ శ్రీనాథ్‌రెడ్డికి ఎస్‌ఐ ఫోన్‌ చేశారు. వారు గ్రామస్థులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ట్రాక్టర్లను తరలించేందుకు ప్రయత్నిస్తుండగా చెట్లలో నుంచి దాదాపు వంది మంది ఒక్కసారిగా శ్రీనాథ్‌రెడ్డి, ఎస్‌ఐతో పాటు గ్రామస్థులపై పారలతో దాడులు చేశారు. సర్పంచ్‌ కారును, ద్విచక్రవాహనాన్ని కూడా ధ్వంసం చేసి పారిపోయారు.


ఈ దాడిలో శ్రీనాథ్‌రెడ్డి గాయపడి స్పృహ కోల్పోయారు. దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలని, ఇసుక మాఫియాకు సహకరిస్తున్న ఇల్లంతకుంట ఎస్‌ఐని వెంటనే సస్పెండ్‌ చేయాలని గ్రామస్థులు బిక్కవాగుపై ధర్నా నిర్వహించారు. సంఘటనా స్థలానికి కరీంనగర్‌ ఏసీసీ విజయసారథి, సీఐ మహేష్‌ గౌడ్‌ శనివారం చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఇసుక మాఫియాను అడ్డుకుంటామని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


Updated Date - 2020-12-13T07:46:07+05:30 IST