వరద సాయాన్ని దోచుకుంటున్నారు

ABN , First Publish Date - 2020-11-03T08:10:43+05:30 IST

వరద సహాయం పంపిణీలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు.

వరద సాయాన్ని దోచుకుంటున్నారు

 టీఆర్‌ఎస్‌ అవినీతిపై విచారణ జరిపించండి

 హైకోర్టు సీజేకు కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ లేఖ

హైదరాబాద్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): వరద సహాయం పంపిణీలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వార్డ్‌ లీడర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులు.. అంతా కలిసి సహాయ నిధిని దోచుకున్నారని ధ్వజమెత్తారు. వరద సాయం పంపిణీలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని, జీహెచ్‌ఎంసీ ఓటరు జాబితా తయారీని వాయిదా వేయాలంటూ హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సకు లేఖ రాశానని, దానిని పిల్‌గా స్వీకరించాలని కోరానని శ్రవణ్‌ వెల్లడించారు.


చాలా మందికి సాయం అందలేదని, వరద సహాయ నిధిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. కొన్ని చోట్ల రూ.10 వేలు ఇచ్చి, దాని నుండి టీఆర్‌ఎస్‌ ఏజెంట్లు కమీషన్లు గుంజుకుంటున్నారని చెప్పారు. ‘‘డబ్బుల పంపిణీపై లెక్కా పత్రం లేదు. టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుకొని లీడర్లు డబ్బులు పంచుతున్నారు. ఈ డబ్బు ఎవరిది ? సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అంటే పబ్లిక్‌ మనీ’’ అని అన్నారు. ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వానికి తొత్తుగా మారిందని ఆరోపించారు. వరదలతో రాష్ట్రం మునిగి ఉన్న పరిస్థితుల్లో ఓటరు జాబితా అంటూ ఎలా ముందుకు వస్తుందని ప్రశ్నించారు.  


Updated Date - 2020-11-03T08:10:43+05:30 IST