రాష్ట్రంలో పాలనా సంక్షోభం
ABN , First Publish Date - 2020-07-08T08:13:57+05:30 IST
రాష్ట్రంలో పాలనా సంక్షోభం
సీఎం ఆరోగ్య పరిస్థితి రహస్యంగా ఉంచడం నేరం: రేవంత్
హైదరాబాద్, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిపాలనా సంక్షోభం ఏర్పడిందని ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పాలన అందించలేని పరిస్థితిలో ఉంటే తాత్కాలికంగా వేరొకరికి బాధ్యతలు అప్పగించాలన్నారు. మంగళవారం జూమ్ యాప్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు ఈటల, కేటీఆర్, హరీ్షరావు ఎవరికి బాధ్యతలు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. ‘‘కేసీఆర్కు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఆరు నెలలూ ఆయన బయటికి రారు. ఫాంహౌ్సకు సీఎంవో హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. పాలన మొత్తం ఫాంహౌస్ నుంచే జరుగుతుందని చెబుతున్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితిని రహస్యంగా ఉంచడం నేరం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి. సమస్య ఉంటే ఏ వైద్యం అందిస్తున్నారో స్పష్టతనివ్వాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితులపై సమీక్ష కోసం గవర్నర్ పిలిచినా వెళ్లని అధికారులపై కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్ని ఒక గొడుగు కిందకి తీసుకురావాలని ఒక్కో ఆస్పత్రికి ఒక్కో ఐఏఎ్సను నియమించి కరోనా పరీక్షల సంఖ్య పెంచాలన్నారు. కరోనా రోగిపైన రూ. 3.50 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారని, అంత ఖర్చు చేస్తే కనీసం నీళ్లు, సరైన తిండీ లభించని పరిస్థితి ఎందుకుందని ప్రశ్నించారు. కరోనా విరాళాలు రూ.4 వేల కోట్లపై ఆన్లైన్లో శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచివాలయం కూల్చివేత దుర్మార్గమని, ఆ స్థలంలో కొత్త సచివాలయం కట్టేందుకు ఎన్జీటీ చట్టం అనుమతించబోదన్నారు. ఈ చట్టం ప్రకారం హుస్సేన్సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో కాంక్రీటు నిర్మాణాలు జరుగకూడదన్నారు. అనుమతులిచ్చినవారు జైలుకు పోతారని రేవంత్ పేర్కొన్నారు.