1447 ఎకరాల ‘దేవాదాయ’ భూమికి విముక్తి
ABN , First Publish Date - 2020-12-17T09:04:41+05:30 IST
ఆక్రమణలకు గురైన విలువైన దేవాదాయ భూముల్ని తిరిగి రాబట్టుకునే పనిలో దేవాదాయ శాఖ నిమగ్నమైంది.

ఆక్రమణల చెర నుంచి స్వాధీనం
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఆక్రమణలకు గురైన విలువైన దేవాదాయ భూముల్ని తిరిగి రాబట్టుకునే పనిలో దేవాదాయ శాఖ నిమగ్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు దేవాలయాలకు సంబంధించి ఆక్రమణలకు గురైన భూముల్ని ఇప్పటికే నిర్వహించిన రెండు స్పెషల్ డ్రైవ్లలో గుర్తించిన దేవాదాయశాఖ అధికారులు ఇప్పుడు మూడో దశ స్పెషల్ డ్రైవ్ను చేపట్టారు. గడిచిన రెండుదఫాలుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 1447 ఎకరాల 33 గుంటల ఆక్రమిత భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మూడో దశ డ్రైవ్లోనూ మరిన్ని భూముల్ని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ‘‘ఆక్రమించుకున్న దేవాలయ భూముల్ని అప్పగించి పుణ్యం మూట కట్టుకోండి’’ అని దేవాదాయశాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఆక్రమిత భూముల్లో యమధర్మరాజు ఫొటోతో ఆలయ భూముల్ని ఆక్రమించుకోవడం పాపం అనే పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు.
పద్ధతిని మార్చుకొని ఆక్రమిత భూముల్ని తిరిగి ఇవ్వకపోతే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా ఆలయ భూములు అన్యక్రాంతం కాకుండా, సులువుగా గుర్తించేందుకు వీలుగా ఇప్పటికే సుమారు 20 వేల ఎకరాల భూములకు ప్రత్యేకంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దేవాదాయ భూముల్లో భక్తుల సౌకర్యార్ధం కల్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. హైదరాబాద్లోని మూడు ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణానికి అనుమతులు కూడా మంజూరయ్యాయి. వీటి ద్వారా సమకూరే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు వెచ్చించనున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.