మరోసారి బాధితురాలి వాంగ్మూల సేకరణ?
ABN , First Publish Date - 2020-09-03T10:21:05+05:30 IST
సంచలనం సృష్టించిన అత్యాచార బాధితురాలి కేసు విషయంలో సీసీఎస్ మహిళా పోలీ్సస్టేషన్ అధికారులు బాధితురాలి వాంగ్మూలాన్ని మరోసారి రికార్డు చేయవచ్చని తెలుస్తోంది.

- తాజా వ్యాఖ్యలతో అమాయకుల పేర్లు తొలగించే అవకాశం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన అత్యాచార బాధితురాలి కేసు విషయంలో సీసీఎస్ మహిళా పోలీ్సస్టేషన్ అధికారులు బాధితురాలి వాంగ్మూలాన్ని మరోసారి రికార్డు చేయవచ్చని తెలుస్తోంది. 139 మంది తనను లైంగికంగా, శారీరకంగా, మానసికంగా వేధించారని ఓ యువతి పంజాగుట్ట పీఎ్సలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. తాను డాలర్భాయ్ చేతిలో కీలు బొమ్మగా మారానని.. అతని బెదిరించడంతోనే అమాయకులపై సైతం కేసులు పెట్టానని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో బాధితురాలు వెల్లడించడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు మరోసారి ఆమె వాంగ్మూలాన్ని సేకరించే అవకాశముంది. తదనుగుణంగా కేసుతో సంబంధం లేనివారి పేర్లను తొలగించవచ్చని అంటున్నారు. నిందితుడు డాలర్ భాయ్ అలియాస్ రాజశ్రీకర్ రెడ్డి చిక్కితే కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశమున్నందున అతనికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.