అడవుల్లో ఆ ప్రాజెక్టు ఎలా అనుమతిస్తారు?
ABN , First Publish Date - 2020-03-13T09:23:45+05:30 IST
వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్టులో ఈస్ట్రన్ నావల్ కమాండ్ నిర్మిస్తున్న ఈఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్టుపై స్టేటస్ కో పాటించాలని హైకోర్టు ఆదేశించింది.

ఒక్క చెట్టునూ కూల్చడానికి వీల్లేదు
కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్టులో ఈస్ట్రన్ నావల్ కమాండ్ నిర్మిస్తున్న ఈఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్టుపై స్టేటస్ కో పాటించాలని హైకోర్టు ఆదేశించింది. అటవీ భూముల్లో లో-ఫ్రీక్వెన్సీ రాడార్ నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని అటవీశాఖ అధికారులను ప్రశ్నించింది. రాడార్ నిర్మాణం కోసం ఒక్క చెట్టునీ నేలకూల్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, విశాఖలోని ఈస్ట్రన్ నావల్ కమాండ్ అధికారులకు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. రిజర్వు ఫారెస్టులో ఈఎల్ఎఫ్ రాడార్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దామగుండం అటవీ పరిరక్షణ జేఏసీ అధ్యక్షుడు ఎల్. మురళీధర్రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ‘‘దేశరక్షణ ఎంతో ముఖ్యం. దాన్ని మేము అర్థం చేసుకోగలం. అయితే పర్యావరణం కూడా ముఖ్యమే’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అటవీ ప్రాంతంలో రాడా ర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎలా అనుమతించారని ప్రశ్నించింది.