ప్రైవేటు టీచర్లకు వేతన కష్టాలు !
ABN , First Publish Date - 2020-04-08T09:54:34+05:30 IST
రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు వేతన కష్టాలు రెట్టింపయ్యాయి. సాధారణంగానే రెండు మూడు నెలలకోసారి వేతనాలు ఇచ్చే యాజమాన్యాలు ఇప్పుడు ఏకంగా 4 నెలల నుంచి వారికి వేతనాలు ...

- కరోనా సాకుతో ఎగ్గొడుతున్న స్కూలు యాజమాన్యాలు
హైదరాబాద్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు వేతన కష్టాలు రెట్టింపయ్యాయి. సాధారణంగానే రెండు మూడు నెలలకోసారి వేతనాలు ఇచ్చే యాజమాన్యాలు ఇప్పుడు ఏకంగా 4 నెలల నుంచి వారికి వేతనాలు ఇవ్వకపోవడం గమనార్హం. కొన్ని స్కూళ్లు జనవరి నుంచి ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వకపోగా మరికొన్ని డిసెంబరు వేతనాలు కూడా ఇవ్వలేదని, ఇప్పుడు కరోనా సాకుతో వేతనాలు ఇచ్చే ఆలోచన కూడా చేయడం లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవంగా కరోనా ఎఫెక్ట్ మార్చి నెలలో ప్రారంభమైంది. కానీ స్కూళ్లు మాత్రం అంతకు ముందు అంటే డిసెంబరు నుంచి కూడా వేతనాలు చెల్లించడం లేదు. యాజమాన్యాలు విద్యార్థుల నుంచి 12 నెలలకు ఫీజులు వసూలు చేస్తూ టీచర్లకు మాత్రం 10 లేదా 11 నెలల వేతనాలు మాత్రమే ఇస్తుండడం గమనార్హం. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10,549 ప్రైవేటు పాఠశాలలుండగా వీటిల్లో 1,01,903 మంది టీచర్లు పని చేస్తున్నారు. నాలుగైదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారంతా అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు వేతనాలు ఇచ్చేలా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.