నేడు సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు
ABN , First Publish Date - 2020-10-04T09:37:51+05:30 IST
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల కోసం అధికారులు
వరంగల్లో 16 పరీక్ష కేంద్రాల్లో 6,763 మంది అభ్యర్థులు
ఎగ్జామ్ సెంటర్లలో ముందస్తుగా శానిటైజేషన్
కొవిడ్ లక్షణాలున్నవారికి ప్రత్యేక గధులు
వరంగల్ అర్బన్ కలెక్టరేట్, అక్టోబరు 3: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. పరీక్షల నిర్వాహణకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక అధికారి అశ్వినికుమార్ మిశ్రాని నియమించింది. ఆదివారం నేడు జరగనున్న పరీక్షలకు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో 16 సెంటర్లు ఏర్పాటు చేయగా 6,763 మంది హాజరుకానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలను కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు అప్రమత్తం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. కొవిడ్ నేపథ్యంలో అభ్యర్థుల మధ్య దూరం కనీసం మూడు ఫీట్లు ఉండేలా సీటింగ్ అరెంజ్మెంట్ చేశారు. పరీక్షకు ఒక రోజు ముందు కేంద్రాలను పూర్తిగా శానిటైజేషన్ చేశారు.
అభ్యర్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఐనప్పటికి 15 శాతం మాస్కులు, గ్లౌజులు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. పరీక్ష కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్ను ఉంచనున్నారు. అభ్యర్థులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నందున వారి సామగ్రి భద్రపరిచేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఎలాంటి ఎలక్ర్టానిక్ వస్తువులకు అనుమతి లేదు. అభ్యర్థులు ఆన్లైన్ కార్డుతో పాటు ఏదైనా ప్రత్యేక గుర్తింపు కార్డు ఉంటేనే గదిలోకి అనుమతిస్తారు. ఒకవేళ ఎలాంటి గుర్తింపుకార్డు లేకున్నా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని పరీక్షకు అనుమతిస్తారు. మొదటి పేపర్ ఉదయం 9:30 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు జరగనుంది. రెండో పేపర్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరగనుంది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించిన తర్వాత అభ్యర్థులు ఎవరితోనూ మాట్లాడకూడదు. నగరానికి దూరంగా ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు టిఫిన్, భోజన వసతి కల్పించారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు.
కొవిడ్ లక్షణాలున్నవారికి ప్రత్యేక గది
అభ్యర్థుల్లో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఉంటే వారిని బయటకు పంపించకుండా ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి పరీక్ష రాయించనున్నారు. ఇందు కోసం ప్రతీ పరీక్ష కేంద్రంలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. అలాగే దివ్యాంగులకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ర్యాంపు, వీల్చైర్ను కూడా అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల రూట్మ్యాప్ తెలిసేలా బస్టాండ్, రైల్వేస్టేషన్లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ తప్పనిపరిస్థితుల్లో అభ్యర్థులు ఒక కేంద్రానికి బదులు మరో పరీక్షకేంద్రానికి వెళ్తే సకాలంలో సొంత పరీక్ష కేంద్రానికి చేరవేసేందుకు ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంచారు. వాహనాలతో పాటు టూ వీల్లర్లను కూడా వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.