నయా నిజాం నుంచి విముక్తి లభించాలి
ABN , First Publish Date - 2020-09-18T09:42:51+05:30 IST
నయా నిజాం నుంచి విముక్తి లభించాలి

తెలంగాణ గాథలన్నీ సినిమాలుగా రావాలి: పాశం యాదగిరి
పాలకుర్తి, సెప్టెంబరు 17: తెలంగాణ రాష్ట్రానికి నయా నిజాం నుంచి విముక్తి లభించేలా రైతాంగ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తిగా ఉద్యమాలు చేయాలని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తిలో గురువారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి, రాజీవ్ చౌరస్తాలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ‘యోధుడు’ (దొడ్డి కొంరయ్య) అనే సినిమా లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ..
నాడు నిజాం నిరంకుశ పాలనపై ప్రజల తిరుగుబాటు వల్ల విముక్తి జరిగిందని.. నేడు రాష్ట్రంలో నయా నిజాం పాలన నుంచి కూడా విముక్తి జరిగేలా అదే తరహా పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణలో భూమి కోసం, భక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చేసిన పోరాట గాథలన్నీ సినిమాలుగా రావాలన్నారు. తెలంగాణలో వెట్టిచాకిరి విముక్తి పోరాటంలో మొట్టమొదట వీర మరణం పొందిన దొడ్డి కొంరయ్య గాథ ఆధారంగా సినిమా తీస్తున్నట్లు ‘యోధుడు’ సినిమా నిర్మాత పి.వీరారెడ్డి తెలిపారు. షూటింగ్ను దసరా తర్వాత ప్రారంభిస్తామన్నారు. ఈ సినిమాను జనగామ జిల్లాలోనే చిత్రీకరిస్తామన్నారు.