విహార యాత్రలో విషాదం
ABN , First Publish Date - 2020-12-21T04:13:16+05:30 IST
విహార యాత్రలో విషాదం

పాకాల చెరువులో ఈతకు వెళ్లి యువకుడి మృతి
ఖానాపురం, డిసెంబరు 20: స్నేహితుల విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. పాకాల సరస్సులో ఈతకు వెళ్లి ఓ యువకుడు నీట మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం. వరంగల్ అర్బన్ జిల్లా అబ్బనికుంటకు చెందిన నాగిరెడ్డి కుమార్కు కుమారుడు, కూతురు ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా, వికాస్(19) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. ఆదివారం మధ్యాహ్నం వికాస్ అబ్బనికుంటకు చెందిన తన మిత్రులతో కలిసి మొత్తం ఏడుగురు కారులో పాకాల సరస్సుకు విహార యాత్రకు వచ్చారు. గిరకతాటి చెట్ల సమీపంలో విందు భోజనాలు చేసి, మద్యం సేవించారు. అనంతరం ఈత కొట్టడానికి కాల్వలోకి దిగారు. ఈక్రమంలో వికాస్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై సాయిబాబు అక్కడికి చేరుకుని జాలర్ల సాయంతో తెప్పల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. మూడుగంటల గాలింపు అనంతరం వికాస్ మృతదేహం లభించింది.