రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ-యాసంగిలో 58శాతం కొనుగోళ్లుపూర్తి
ABN , First Publish Date - 2020-05-13T19:56:30+05:30 IST
గత ఏడాది యాసంగి కంటే ఈసారి ఽరికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ జరిగిందని పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది.

హైదరాబాద్: గత ఏడాది యాసంగి కంటే ఈసారి ఽరికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ జరిగిందని పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రచర్రితలోనే యాసంగిలో అత్యధికంగా ధాన్యం కొనుగోలుచేసి తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. కరోనా లాక్డౌన్ నేపధ్యంలోనూ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేగవంతంగా కొనుగోళ్లు జరుపుతోందని అధికారులు తెలిపపారు. 2016- 2017 యాసంగిలో 37.21 లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం సేకరించగా 2018-19 యాసంగిలో 37.05 లక్షల మెట్రిక్టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కానీ ఈసంవత్సరం కేవలం నెల రోజుల్లో 39లక్షల మెట్రిక్టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో 6319 కొనుగోలు కేంద్రాల ద్వారా 7లక్షల మంది రైతుల నుంచి 7.129 కోట్ల విలువైన 39లక్షల మెట్రిక్టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆయన ప్రకటించారు. యాసంగిలో ఇప్పటి వరకూ 50శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే 3.715 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. నల్గొండ, మహబూబ్నగర్, జిల్లాల్లో 90శాతానికి పై గా కొనుగోళ్లు పూర్తయినట్టు తెలిపారు. ఖమ్మం, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో 70శాతానికి పై, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, జనగాం, యాదాద్రి, మేడ్చల్ జిల్లాల్లో 60శాతం కొనుగోళ్లు పూర్తయినట్టు ఆయన తెలిపారు.