‘ఆహారశుద్ధి’లో అపార అవకాశాలు
ABN , First Publish Date - 2020-06-23T09:40:01+05:30 IST
రాష్ట్ర వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులతో ఆహార శుద్ధి రంగంలో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫోరం

హైదరాబాద్, జూన్ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులతో ఆహార శుద్ధి రంగంలో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫోరం మంగళవారం నిర్వహించిన ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ ఎడిషన్ వెబినార్లో కేటీఆర్ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో జల విప్లవం కొనసాగుతోందన్నారు. వ్యవసాయ రంగంతో పాటు పాలు, మాంసం, చేపల ఉత్పత్తుల్లో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున అవకాశాలు ఏర్పడనున్నాయన్నారు. వీటి వలన ఆహారశుద్ధి, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, తద్వారా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అత్యంత సౌకర్యవంతమైన విషయమని మంత్రి అన్నారు. తెలంగాణలో ప్రారంభించిన నూతన ప్రాజెక్టులతో పెద్దఎత్తున సాగునీటి వనరులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సమావేశంలో ప్రపంచంలో ఇతర ప్రాంతాల నుంచి సుమారు 200 పెట్టుబడిదారులు పాల్గొన్నారు.