ఐదు జిల్లాల్లో నో కరోనా
ABN , First Publish Date - 2020-04-12T09:17:25+05:30 IST
రాష్ట్రంలో నెల రోజుల నుంచి ప్రతి రోజూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ, ఐదు జిల్లాల్లో ఇప్పటికి ఒక్క కేసూ నమోదు కాకపోవడం కొంతలో కొంత ఊరటనిస్తోంది. శనివారం నాటికి వరంగల్

- మరో నాలుగైదు రోజులు గడిస్తే..
- అక్కడ ఇక ‘మర్కజ్ కేసులు’ లేనట్టే
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నెల రోజుల నుంచి ప్రతి రోజూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ, ఐదు జిల్లాల్లో ఇప్పటికి ఒక్క కేసూ నమోదు కాకపోవడం కొంతలో కొంత ఊరటనిస్తోంది. శనివారం నాటికి వరంగల్ రూరల్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణ పేట, వనపర్తి జిల్లాలు మినహా 28 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా రాష్ట్రంలో తొలుత నాలుగైదు జిల్లాలోనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పది జిల్లాలకు కరోనా విస్తరించింది. ఎప్పుడైతే మర్కజ్ వ్యవహారం బయటకు వచ్చిందో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ప్రతి రోజూ కనీసం 15కు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఖమ్మంలోనూ కేసులు నమోదు కాలేదు. ఇప్పుడు ఒక్కసారిగా కేసులు బయటపడుతున్నాయి. తాజాగా శనివారం ఆ జిల్లాల్లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఖమ్మంలో కేసుల సంఖ్య 4కు చేరింది. పాజిటివ్ కేసులు నమోదు కాని ఐదు జిల్లాల్లోనూ మర్కజ్కు వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. పైగా వీరంతా ఒక సమూహంగా వెళ్లినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. అయితే, వీరు ఇతరులతో పెద్దగా సంబంధం లేకుండా గడిపారని, రైళ్లలోనూ ఇతర మర్కజ్ యాత్రికులతో కలసి రాలేదని తేలింది. అందుకే మర్కజ్కు వెళ్లివచ్చి దాదాపు 24 రోజులు అవుతున్నా... వారిలో ఇప్పటికైతే ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదు.