ఆదివాసీ యువకులు క్రీడల్లో పాల్గొనాలి
ABN , First Publish Date - 2020-12-12T04:23:13+05:30 IST
ఆదివాసీ యువకులు క్రీడల్లో పాల్గొనాలి
ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్
ములుగు పోలీస్ గిరిజన క్రీడలు ప్రారంభం
మేడారం, డిసెంబరు 11 : ఆదివాసీ యువత క్రీడల్లో పాల్గొని, సత్తాచాటాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పిలుపునిచ్చారు. మేడారంలోని ఓపెన్ థియేటర్ ప్రాంగణంలో శుక్రవారం ములుగు జిల్లా పోలీస్, గిరిజన క్రీడలను అదనపు కలెక్టర్ ఆదర్శ్సురభి, ఐటీడీఏ పీవో హన్మంత్ కె జెండగేతో కలసి ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. పస్రా సీఐ అనుముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అఖండజ్యోతి వెలిగించి బెలూన్లను ఎగురవేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. గ్రామగ్రామాన చీకటిని పారద్రోలేందుకు ఈ అఖండజ్యోతి వస్తుందోన్నారు. ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఆదివాసీ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనాలని కోరారు. ప్రతీ మండలంలో నెలరోజులు క్రీడలు కొనసాగుతాయని, క్రీడలతోపాటు చదువు కూడా అంతే అవసరమని సూచించారు. గొత్తికోయ యువత చదువు, క్రీడల్లో వెనుకబడి ఉన్నారని, వారిని ప్రోత్సహించేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆదివాసీ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ ఆదర్శ్సురభి మాట్లాడుతూ క్రీడాకారులకు క్రమశిక్షణ, పట్టుదల ఎంతో అవసరమని, ఆటలతో మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందన్నారు. అనంతరం అధికారులు అఖండజ్యోతితో వనదేవతలను దర్శించుకున్నారు. ఓఎస్డీ శోభన్కుమార్, ఏఎస్పీ సాయిచైతన్య, ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం, ఏఆర్ ఏఎస్పీ సీహెచ్.కుమారస్వామి, తాడ్వాయి ఎంపీపీ గొంది వాణిశ్రీ, మేడారం సర్పంచ్ బాబూరావు, సీఐలు, ఎస్సైలు, సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.