479 కేసుల్లో నిందితులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు
ABN , First Publish Date - 2020-12-27T08:19:30+05:30 IST
తెలంగాణలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రత్యేక కోర్టులో సరైన విచారణ జరగడం లేదని గవర్నర్ తమిళిసై సౌందర

509 కేసుల్లో ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసింది 245 మాత్రమే
సత్వర విచారణకు ఆదేశించాలని గవర్నర్కు ఎఫ్జీజీ లేఖ
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రత్యేక కోర్టులో సరైన విచారణ జరగడం లేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) లేఖ రాసింది. 64 మంది ఎమ్మెల్యేలపై 346 కేసులు నమోదు కాగా, 10 మంది ఎంపీలపై 133 కేసులు నమోదు అయ్యాయని ఎఫ్జీజీ కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి వివరించారు. మాజీ ప్రజాప్రతినిధులపైనా సుమారు 30 వరకు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులపై నమోదైన మొత్తం కేసులు 509 ఉండగా.. ప్రత్యేక కోర్టుకు కేవలం 245 కేసులు మాత్రమే బదిలీ అయ్యాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు పని మొదలుపెట్టినప్పటి నుంచి ప్రభుత్వం, పోలీస్ శాఖ కోర్టుకు కావాల్సిన సహకారం అందించడం లేదని ఆరోపించారు.
ఇప్పటి వరకు ప్రత్యేక కోర్టులో 73 కేసుల్లో తీర్పు వెలువడగా.. ఏ ఒక్క కేసులోనూ ఏ ఒక్కరికీ శిక్ష పడలేదన్నారు. నిందితులు పలుకుబడి ఉన్నవారు కావడంతో శిక్ష పడటంలేదని, దీంతో పోలీస్ యంత్రాంగంపై అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. కేసుల సత్వర విచారణకు చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని గవర్నర్ను పద్మనాభరెడ్డి కోరారు.