కొత్త సెక్రటేరియట్లో మందిరం, మసీదులు, చర్చిని నిర్మిస్తాం: కేసీఆర్
ABN , First Publish Date - 2020-09-05T22:41:46+05:30 IST
కొత్తగా నిర్మించే సెక్రటేరియట్లో మందిరం, మసీదులు, చర్చిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్లో ముస్లిం మత పెద్దలతో సీఎం సమావేశమయ్యారు.
![కొత్త సెక్రటేరియట్లో మందిరం, మసీదులు, చర్చిని నిర్మిస్తాం: కేసీఆర్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020090504562818/09052020171135n51.jpg)
హైదరాబాద్: కొత్తగా నిర్మించే సెక్రటేరియట్లో మందిరం, మసీదులు, చర్చిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్లో ముస్లిం మత పెద్దలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దల అభిప్రాయాలు, సూచనలను కేసీఆర్ తీసుకున్నారు. కొత్తగా నిర్మించే సెక్రటేరియట్లో మందిరం, మసీదులు, చర్చిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని తెలిపారు. పాత భవనాలు కూల్చివేస్తున్న సందర్భంలో మందిరం, రెండు మసీదులకు నష్టం వాటిల్లిందని, వాటిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత గంగా జమునా తహజీబ్కు అద్దం పట్టేలా.. ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేస్తామని, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
‘‘అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్లో ఇస్లామిక్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ చుట్టూ ఖబ్రస్థాన్లు రావాల్సిన అవసరం ఉంది. స్థలాలు సేకరించాలని రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను ఆదేశించాం. హైదరాబాద్లో వివిధ చోట్ల 150 నుంచి 200 ఎకరాల్లో ఖబ్రస్థాన్లు ఏర్పాటు చేస్తాం. ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చి, విద్య నేర్పించే.. అనీస్- ఉల్-గుర్భా నిర్మాణం వేగవంతం చేస్తాం’’ అని ముస్లిం పెద్దలకు కేసీఆర్ హామీ ఇచ్చారు.