రేపు హైదరాబాద్‌కు మోదీ

ABN , First Publish Date - 2020-11-27T07:29:00+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో..

రేపు హైదరాబాద్‌కు  మోదీ

సాయంత్రం 4-5 గంటల నడుమ భారత్‌ బయోటెక్‌ సందర్శన

తొలుత పుణెలోని ఎస్‌ఐఐకి

అక్కడి నుంచి హైదరాబాద్‌కి

రెండు చోట్లా కొవిడ్‌ వ్యాక్సిన్‌పై సమీక్ష

 న్యూఢిల్లీ, నవంబరు 26: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. వ్యాక్సిన్‌ పురోగతిని పరిశీలించేందుకు ఆయన పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(సీఐఐ), హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించనున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం ఆయన తొలుత పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు వెళ్తారు.

అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు పుణె నుంచి బయల్దేరి.. 3.45 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి భారత్‌ బయోటెక్‌కు చేరుకుని.. కొవాగ్జిన్‌ ఉత్పత్తి, పంపిణీ తదితర అంశాలను సమీక్షిస్తారు. 


అనంతరం 5.15 గంటలకు బయల్దేరి హకీం పేట విమానాశ్రయానికి చేరుకుని.. 5.40 గంటలకు బయల్దేరి, రాత్రి 7.45 గంటలకు ఢిల్లీలో దిగుతారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ సభ జరగనున్న సంగతి తెలిసిందే.

అదే రోజు మోదీ నగరానికి రావడం గమనార్హం ఆయన ప్రచారంలో పాల్గొనకపోయినా, నగరానికి రావడం రాజకీయ సంకేతాలను ఇచ్చినట్టవుతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ఏడాదికి 90 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండగా.. భారత్‌బయోటెక్‌కు 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.


Updated Date - 2020-11-27T07:29:00+05:30 IST