రైతులను ముంచే మోదీ ప్రభుత్వం : చాడ
ABN , First Publish Date - 2020-12-01T08:34:26+05:30 IST
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులను ముంచేదిగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు.

రైతులపై లాఠీ చార్జీకి నిరసనగా ఇందిరాపార్కు వద్ద ధర్నా
హైదరాబాద్,/కవాడిగూడ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులను ముంచేదిగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి వెళుతున్న రైతులపై లాఠీ చార్జి చేసి, వారిని నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ( ఏఐకేఎ్ససీసీ) ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ విధానాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలిపారు.
బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా 60 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది ముమ్మాటికీ బీజేపీ పాపమే అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతుసంఘ నాయకులు కేంద్ర రైతాంగ విధానాలను నిరసిస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. వెంకట్రామయ్య రాసిన ‘వ్యవసాయదారుల ఆదాయం పెంపు- మోడీ ప్రభుత్వ మహా మోసం’ అనే పుస్తకాన్ని వామపక్ష పార్టీల నాయకులు, రైతు సంఘం నాయకులు ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహ, జేవి.చలపతిరావు, సాగర్, పశ్య పద్మ, వేముల పల్లి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.