ఆధునిక భారత నిర్మాతలు వలస కార్మికులే!

ABN , First Publish Date - 2020-07-05T06:58:54+05:30 IST

ఆధునిక భారత నిర్మాతలు వలస కార్మికులేనని, ఒక వ్యవస్థ నడవడానికి, నిలవడానికి అవసరమైన దినుసులు వారేనని ఆంధ్రజ్యోతి

ఆధునిక భారత నిర్మాతలు వలస కార్మికులే!

  • ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీనివాస్‌.. ‘వలస దుఃఖం’ పుస్తకావిష్కరణ


హైదరాబాద్‌ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఆధునిక భారత నిర్మాతలు వలస కార్మికులేనని, ఒక వ్యవస్థ నడవడానికి, నిలవడానికి అవసరమైన దినుసులు వారేనని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె శ్రీనివాస్‌ అన్నారు. లాక్‌డౌన్‌తో వలస కార్మికులు పడిన వెతలను అక్షరీకరించిన 110 మంది కవుల రచనలతో కూడిన ‘వలస దుఃఖం’ కవితా సంకలనాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. శనివారం టీజీవో సంఘ కార్యాలయంలో ఈ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ మొత్తం మానవజాతి పురోగమనానికి దారులు వేసిన గొప్ప శక్తులైన వలస కార్మికుల జీవితాలు భారతదేశ నట్టనడివీధుల్లో ఆర్తనాదాలయ్యాయని అన్నారు.


కరోనాను చాటు చేసుకొని ప్రభుత్వం కార్మికుల్ని, పేదల్ని, అణగారిన వర్గాలను చావుకు సిద్ధం చేసిందని, ప్రజావ్యతిరేక విధానాలను యథేచ్ఛగా అమల్లోకి తీసుకువచ్చిందని ఆయన విమర్శించారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ... ‘‘ఈ నేపథ్యంలో మనుషులు మారినట్లు కనిపిస్తున్నారు. కానీ మారలేదు. భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. కానీ, భయపడటం లేదు’’ అని అన్నారు. ఈ సమయంలో ‘‘వలస దుఃఖం’’ సంకలనాన్ని అచ్చువేసిన సంపాదకవర్గాన్ని ఆయన అభినందించారు. దొడ్డి కొమురయ్య ఫౌండేషన్‌, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో, డీకేఎఫ్‌ అధ్యక్షుడు అప్పాల శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. సభలో కారం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్‌, వెంకట్‌ గుండూరి, కవులు నాళేశ్వరం శంకర్‌, యాకూబ్‌, ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2020-07-05T06:58:54+05:30 IST