ఎమ్మెల్యేల‘మహా ధర్నా’ రద్దు
ABN , First Publish Date - 2020-12-30T05:36:51+05:30 IST
ఎమ్మెల్యేల‘మహా ధర్నా’ రద్దు

ప్రారంభానికి అరగంట ముందు నిర్ణయం
అధిష్ఠానం ఆదేశాల మేరకే విరమించుకున్నారని ప్రచారం
ప్రారంభానికి అరగంట ముందు నిర్ణయం
అధిష్ఠానం ఆదేశాల మేరకే విరమించుకున్నారని ప్రచారం
వరంగల్ రూరల్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్ మంగళవారం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన మహా ధర్నా ఆకస్మికంగా రద్దయింది. ఉదయమే అన్ని ఏర్పాట్లు పూర్తయి మరికొద్దిసేపట్లో ప్రారంభం అవుతుందనగా ఆగమేఘాలపై టెంట్ను, వేదికను తొలగించారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఏడు ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయగా, కేంద్ర జల్శక్తి శాఖ వరంగల్ జిల్లాలోని మూడు ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో రూరల్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్లు వారం రోజుల క్రితం సమావేశమై రూరల్ కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నాకు పిలుపునిచ్చారు. రూరల్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు కలిసి రావాలంటూ గ్రామాల్లో పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. సోమవారం రాత్రి వరకు హైదరాబాద్లోనే ఉన్న ఎమ్మెల్యేలు, నేతలు ధర్నాకు తరలిరావాలంటూ మంగళవారం ఉదయం 9 గంటల వరకు కూడా పార్టీ కేడర్కు ఫోన్లు చేశారు. అయితే ఉదయం 9 దాటిన అనంతరం ధర్నా రద్దు చేసుకోవాలని హైదరాబాద్ నుంచి ఫోన్లు రావడంతో ఎమ్మెల్యేలు అదే సమాచారాన్ని కేడర్కు తెలియపరిచి ధర్నాకు బ్రేక్ వేశారు. కాగా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చివరి నిమిషంలో చేసిన ఒత్తిడి మూలంగానే ఎమ్మెల్యేల ధర్నా వాయిదా పడినట్టు తెలుస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ధర్నాను ఉపసంహరించుకునేలా గోదావరి బోర్డు ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో 10 రోజుల్లో సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని బోర్డు సూచించడంతోనే ధర్నా విరమించుకున్నట్టు నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకోవడం కూడా రద్దుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా, ధర్నా రద్దు అయిందని తెలియగానే ప్రధాన రహదారిపై అంతకుముందే వేసిన టెంట్ను, వేదికను ఆగమేఘాలపై తొలగించారు.