ప్రభుత్వ, దేవాలయ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలే- తలసాని
ABN , First Publish Date - 2020-09-17T00:00:44+05:30 IST
ప్రభుత్వ, దేవాలయ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు.

హైదరాబాద్: ప్రభుత్వ, దేవాలయ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. బుధవారం గోషామహల్ నియోజక వర్గపరిధిలోని బేగంబజార్ డివిజన్మహారాజ్గంజ్లో గల రఘునాధ్స్వామి ఆలయాన్ని దేవాదాయశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శిధిలావస్థలో ఉన్న నిర్మాణాలు పరిశీలించి ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని ట్రస్ట్ సభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మహేశ్వరి సమాజ్ ఆధ్వర్యంలో వంశపారంపర్యంగా నిర్వహిస్తూ వస్తున్నారని వివరించారు.
కొందరు ప్రైవేట్ వ్యక్తులు దేవాలయ భూములను ఆక్రమించేందుకు తప్పుడు సమాచారంతో కోర్టులలో కేసులు వేస్తున్నారని, అలాంటి వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే కోర్టుల్లో ఉన్న కేసుల్లో క్లియరెన్స్ వచ్చిందని తెలిపారు. వారం రోజులలో దేవాదాయ, మహేశ్వరి సమాజ్ సభ్యులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. దాతల సహకారంతో ఆలయ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని చెప్పారు.
ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక నివేదికను రూపొందించాలని మహేశ్వరి సమాజ్సభ్యులకు మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శంకర్ యాదవ్, పరమేశ్వరి సింగ్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్కమిషనర్ బాలజీ, ఆలయ ఈవో మహేందర్, మహేశ్వరి సమాజ్సభ్యులు పాల్గొన్నారు.