గ్రేటర్లో పర్యాటక స్థలాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు- శ్రీనివాస్గౌడ్
ABN , First Publish Date - 2020-05-12T01:48:05+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధితో పాటు పర్యాటక శాఖలోని అన్నివిభాగాలు లాభాల బాటలో నడిపేందుకు అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
![గ్రేటర్లో పర్యాటక స్థలాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు- శ్రీనివాస్గౌడ్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020051108164689/05112020201759n47.jpg)
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధితో పాటు పర్యాటక శాఖలోని అన్నివిభాగాలు లాభాల బాటలో నడిపేందుకు అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పర్యాటక ప్రాంతాల్లో భూములు లీజుకు తీసుకున్న సంస్థల కాలపరిమితులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం పై పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టిపెట్టారు. ఈమేరకు సోమవారం తన కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జిల్లా ఇన్చార్జి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి సమావేశం నిర్వహించారు.తెలంగాణ పర్యాటక శాఖకు చెందిన స్థలా లీజులు, అద్దెల విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించారని, ఆయా సంస్థలు కోర్టులలో దాఖలు చేసిన కేసులను గుర్తించి వాటిపై వెంటనే కౌంటర్ దాఖలు చేసే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
లీజు స్థలాలపై ఉన్న చిన్నచిన్న వివాదాలు, కేసులు ఉన్నాయో, లీజు హోల్డర్స్ నిబంధలకు విరుద్ధంగా ఎక్స్టెన్షన్ చేశారో వాటన్నింటిని అధ్యయనం చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారును ఆదేశించారు. పర్యాటక శాఖకు చెందిన స్థలాల అద్దెలు తక్కువగా ఉన్నవాటిని గుర్తించి వాటి లీజు, అద్దెలు పెంచడానికి చర్యమలు తీసుకోవాలని అన్నారు. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన హోటళ్లు, రెస్టారెంట్ల పై కూడా పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నష్టాల్లోనడుస్తున్న వాటిని గుర్తించి లాభాల్లోకి తెచ్చేవిధంగా ప్రతిపాదనలు చేసి వాటిని మున్సిపల్శాఖమంత్రి కేటీఆర్తో చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్కు వివరాలను అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.