తెలంగాణ ప్రజల కళ్ళలో సంతోషం చూడటమే మా లక్ష్యం: కేటీఆర్
ABN , First Publish Date - 2020-08-01T17:45:00+05:30 IST
తెలంగాణ ప్రజల కళ్ళలో సంతోషం చూడటమే మా లక్ష్యం: కేటీఆర్

హైదరాబాద్: 2001 ఏప్రిల్ లో జల దృశ్యం వేదికగా పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో కేసీఆర్ గారు మంచి లక్ష్యంతో పార్టీ స్థాపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్టీ ఏర్పాటైన ముహూర్తం చాలా బలమైందని...100 సంవత్సరాల పాటు ఇలానే దృఢంగా ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో జల దృశ్యం నుండి మమ్మల్ని రోడ్డుపైకి గెంటేశారని గుర్తుచేశారు. కానీ ముహూర్త బలంతో తాము ఇంత దూరం వచ్చామని చెప్పుకొచ్చారు.
రోడ్డుపై పడ్డ పరిస్థితి నుండి ఈ రోజు హైదరాబాద్ నడి బొడ్డున తెలంగాణ భవన్లో 60 లక్షల మందికి ఇన్సూరెన్స్ ఇచ్చే స్థాయికి వచ్చామని తెలిపారు. అన్నం తిన్నారో అటుకులు బుక్కరో కానీ అన్ని రకాల ఆటుపోట్లను ఎదుర్కుని కార్యకర్తలు పార్టీని ఇంత ఎత్తుకు తీసుకొచ్చారని మంత్రి తెలిపారు. మొదటి 13 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీపై అనేక కుట్రలు జరిగాయని విమర్శించారు.
పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం కేవలం టీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఒకటే రాష్ట్రం ఒకటే లక్ష్యమని...తెలంగాణ ప్రజల కళ్ళలో సంతోషం చూడటమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రారంభం అయిన నాటి నుండి నేటి వరకు 47 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు కట్టామని అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం మరిన్ని కొత్త కార్యక్రమాలు రూపొందిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. భారత దేశంలో ఏ పార్టీ లేనంత పటిష్టంగా టీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు. ఎలాంటి
ఎన్నికలు అయినా ప్రత్యర్థులను కాకవికాలం చేస్తుంది టీఆర్ఎస్ అని అన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని పార్టీ అని స్పష్టం చేశారు. కార్యకర్తల ఇంటికే ఇన్సూరెన్స్ చెక్కులు అందుతున్నాయన్నారు. జిల్లాలో పార్టీ కార్యాలయాల భవనాలు దాదాపు పూర్తి అయ్యాయని మంత్రి తెలిపారు. కరోనా సంక్షోభంతో శిక్షణ కార్యక్రమలు వాయిదా వేసినట్లు చెప్పారు.
కరోనా కష్టకాలంలో ప్రజలకు పార్టీ కార్యకర్తలు అండగా ఉండాలన్నారు. ‘‘నా జన్మదినం సందర్భంగా నేను నా నియోజకవర్గానికి 6 అంబులెన్స్లు ఇవ్వాలి అని తీసుకున్న నిర్ణయంతో మిగితా నాయకులు కూడా అందరూ కలిసి 100 పైగా అంబులెన్స్లు సమకూర్చారు. కరోనా సంక్షోభం పూర్తిగా పొయ్యేవరకు ప్రజలకు అండగా ఉందాం’’ అంటూ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.