మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే కేసీఆర్‌ లక్ష్యం-ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-09-03T22:59:33+05:30 IST

మహిళల స్వయం సమృద్ధి, సాధికారతే లక్ష్యంగా , పేద మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావుఅన్నారు.

మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే కేసీఆర్‌ లక్ష్యం-ఎర్రబెల్లి

హైదరాబాద్‌: మహిళల స్వయం సమృద్ధి, సాధికారతే లక్ష్యంగా , పేద మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావుఅన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో అత్యంత శ్రద్ధతో ప్రభుత్వం వ్యవసాయానుబంధ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌యూనిట్‌లపై దృష్టి సారించిందని చెప్పారు. పేదరిక నిర్మూలన సంస్థ (సెర్చ్‌) ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌,టీఎస్‌ఐపార్ట్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో కాళేశ్వరం, దేవాదుల , ఎస్సారెస్పీ వంటి అనేకానేక ప్రాజెక్టులతో జల విప్లవం వచ్చిందన్నారు. 24గంటలూ విద్యుత్‌, రుణమాఫీ, రైతులకు పెట్టుబడులు, అందుబాటులో ఎరువులతో రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా సాగులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. జల విప్లవం, నీలి (మత్స్య) విప్లవానికి, గులాబీ (మాంసం), విప్లవానికి, శ్వేత(పాడి) విప్లవానికి దారితీసిందన్నారు. 


నిరుపేద మహిళలను సంఘటిత పరిచి రాష్ట్రంలో వేలాది మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపులో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిన మన రాష్ట్రంలో పేదిరక నిర్మూలనసంస్థ(సెర్చ్‌) కృషి వెలకట్టలేనిదని అన్నారు. సెర్చ్‌ ఆధ్వర్యంలోనే ఇప్పటికే 65,362 మహిళా రైతులతో 14,131 రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 19 జిల్లాల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్నరైతు మహిళా ఉత్పత్తి సంఘాలతో రాష్ట్రసమాఖ్యను ఏర్పాటు చేస్తామన్నారు.


పేద మహిళల సమీకరణ, సంఘటిత పరచడంలో విజయం సాధించిన సెర్చ్‌ ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి , విస్తరణకు కృషి చేయాలని ఆదేశించారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర క్రియాశీలకమైందని, మహిళా సాధికారత సాధన దిశగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు ఆహారశుద్ధి పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ పరిశ్రమల్లో మహిళలను భాగస్వాములను చేసి తెలంగాణను స్వయం సమృద్ధ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-09-03T22:59:33+05:30 IST