తెలంగాణ కోసం కేసీఆర్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు- ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-04-09T01:17:58+05:30 IST
తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు అన్నారు.

మహబూబాబాద్: తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు అన్నారు. రైతులను సంతోషంగా ఉంచడానికి వీలుగా కాళేశ్వరం, దేవాదుల నీటిని ఎడారిగా మారిన పాలకుర్తి నియోజకవర్గానికి నీటిని అందించారని అన్నారు. బుధవారం పాలకుర్తినియోజక వర్గంలోని తొర్రూరులో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి , దిగుబడులు తెలుసుకుని వారి పంటలను ప్రభుత్వమే కొనుగోలుచేస్తుందని భరోసా ఇచ్చారు. జిల్లాకు నీరు రావడంతో ఈసారి పంటలు బాగా పండాయని మంచి దిగుబడులు వచ్చాయన్నారు. అయితే పక్కరాష్ర్టాల్లో ధాన్యం, మొక్కలు కొనుగోలుచేసే దిక్కులేని పరిస్థితి నెలకొందన్నారు. కరోనా ఎఫెక్ట్తో ప్రపంచమే అతలా కుతలం అయిపోతోందన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారని తెలిపారు. తెలంగాణలోనూ అలాంటి పరిస్థితి ఉన్నా , సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఎన్నో సదుపాయాలు ప్రజలకు కల్పిస్తున్నారని వెల్లడించారు. లాక్డౌన్ ప్రకటించి కరోనా వ్యాప్తిని నిరోధిస్తున్నారని చెప్పారు. ప్రజలకు నిత్యావసర సరుకులు , కూరగాయలు అందుబాటులో ఉంచారన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని అన్నారు ఈ పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. ఒక్క తెలంగాణలోనే సీఎం కేసీఆర్ వల్ల సాధ్యమైందన్నారు. కరోనా కట్టడికి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్యం కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని అన్నారు.