హరితహారంలో అందరినీ భాగస్వాములను చేయాలి- అల్లోల

ABN , First Publish Date - 2020-06-23T21:45:27+05:30 IST

తెలంగాణలో ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆరోవిడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రజా ప్రతినిధులను కోరారు.

హరితహారంలో అందరినీ భాగస్వాములను చేయాలి- అల్లోల

హైదరాబాద్‌: తెలంగాణలో ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆరోవిడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రజా ప్రతినిధులను కోరారు. సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ప్రజల్ని భాగస్వాములరు చేయాలన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రజా ప్రతినిధులకు లేఖ రాశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలలంగాణ రాష్ట్రం చేపట్టిన అనేక పధకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ర్టాలు అమలుచేయడం మనకు గర్వకారణమని అన్నారు. 


తెలంగాణకు హరితహారం , రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు సీఎం కేసీఆర్‌ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 24శాతం అటవీ సంపద 33శాతానికి పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 230కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకూ 182 కోట్ల మొక్కలు నాటినట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి దూరదృష్టికి, ప్రణాళికకు అనుగుణంగా అందరి సహకారంతో గత ఐదేళ్లుగా రాష్ట్రంలో హరితహారం ఓ ఉద్యమంలా కొనసాగుతోందన్నారు. తెలంగాణలో చేపట్టిన హరితహారం రాష్ట్రంలో సత్ఫలితాలు ఇస్తోందన్నారు.


ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. మెదక్‌జిల్లా నర్సాపూర్‌ అటవీ పునరుజ్జీవనం కార్యక్రమంలో భాగంగా కేసీఆర్‌ మొక్కలను నాటనున్నట్టు తెలిపారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో 30కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రతి శాసన సభ్యుడు తన నియోజక వర్గంలో ప్రజలందరి భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తిచేశారు. 

Updated Date - 2020-06-23T21:45:27+05:30 IST