వలస కార్మికులను ఆదుకోవడంలో విఫలం
ABN , First Publish Date - 2020-05-17T09:44:51+05:30 IST
వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. వారి సమస్యలపై ఈ నెల 19న దేశవ్యాప్తంగా ఆందోళన...
![వలస కార్మికులను ఆదుకోవడంలో విఫలం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
19న దేశ వ్యాప్తంగా ఆందోళన: సురవరం
హైదరాబాద్, మే 16(ఆంధ్రజ్యోతి): వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. వారి సమస్యలపై ఈ నెల 19న దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. మగ్ధూం భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఇంత మంది వలస కార్మికులు ఉన్నారన్న విషయం లాక్డౌన్ ప్రకటించే ముందు కేంద్రానికి తెలియదా? అని ప్రశ్నించారు. 2011 లెక్కల ప్రకారం దేశంలో 10 కోట్ల మంది వలస కార్మికులున్నారని, ఇప్పుడు వారి సంఖ్య రెట్టింపు అయిందన్నారు. పార్జీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ వలస కార్మికుల పక్షాన మాట్లాడేందుకు వెళ్లిన తనను, పార్టీ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డిని స్థానిక పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ వలస కార్మికులతోపాటు భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల నుంచి ఏపీ వసూలు చేసిన రూ.52వేల కోట్లను వారికి పంపిణీ చేయాలని తీర్పు ఇచ్చిన ఏపీ హైకోర్టుకు పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి ఈటలకు తమ్మినేని లేఖ
కరోనా తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంత్రి ఈటల రాజేందర్కు శనివారం లేఖ రాశారు. రాజధానిలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.