తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
ABN , First Publish Date - 2020-08-12T03:29:10+05:30 IST
ప్రస్తుతం ఉన్న తన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని మరింతగా విస్తరించనుంది.

హైదరాబాద్ : మెడికల్ డివైస్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్ ట్రానిక్స్ తెలంగాణను తన పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకుంది. అమెరికా బయట మెడ్ట్రానిక్స్కు అతిపెద్ద ఆర్అండ్డీ సెంటర్ ఇదే. ఇందుకోసం సుమారు 1200 కోట్ల రూపాయలతో తన ప్రస్తుత కార్యకలాపాలను విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న తన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని మరింతగా విస్తరించనుంది. ఈ మెడ్ ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు ఇన్నోవేషన్ సెంటర్ అమెరికా అవతల అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కానున్నది. రానున్న ఐదు సంవత్సరాల్లో ఈ కేంద్రం విస్తరణ కోసం పన్నెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ పెట్టుబడితో మెడికల్ డివైసెస్ హబ్గా హైదరాబాద్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
మెడ్టెక్ హబ్గా హైదరాబాద్
ఈ పెట్టుబడితో మెడ్ టెక్ హబ్గా హైదరాబాద్ మారుతుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరిన్ని పెట్టుబడులు, అనేక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. మంగళవారం నాడు జరిగిన వర్చువల్ మీటింగ్లో భాగంగా కేటీఆర్.. మెడ్ ట్రానిక్స్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను వివరించారు. ముఖ్యంగా మెడికల్ డివైస్ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. తన అమెరికా పర్యటనలో కంపెనీ చైర్మన్గా ఎంపికైన సందర్భంగా ఒమర్కు అభినందనలు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. మెడ్ ట్రానిక్స్ కంపెనీ హైదరాబాద్ నగరాన్ని తమ అతిపెద్ద ఆర్అండ్డి సెంటర్కి గమ్యస్థానం ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ పెట్టుబడి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పనతో పాటు, ఈ రంగంలో మరిన్ని నూతన పెట్టుబడులు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మెడ్ టెక్ రంగ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఈ రోజు మెడ్ ట్రానిక్స్తో జరుగుతున్న ఒప్పందం దీన్ని సూచిస్తుందని తెలిపారు. మెడికల్ డివైసెస్ కంపెనీలతో కలిసి పనిచేస్తూ ప్రపంచ ఆరోగ్య రంగంలో సానుకూల మార్పు దిశగా పని చేస్తామని మంత్రి అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార ధోరణులను పరిశీలించినప్పుడు భారతదేశానికి ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు.
