మేడివాగులో ఇద్దరు అన్నదమ్ముల గల్లంతు
ABN , First Publish Date - 2020-08-22T09:26:25+05:30 IST
వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ములుగు జిల్లా మేడివాగు వరద ఉధృతిలో గురువారం ఇద్దరు అన్నదమ్ములైన మత్స్యకారులు అల్లం శివాజీ, యువరాజ్ గల్లంతయ్యారు.
- ఒకరి మృతదేహం లభ్యం.. మానేరులో ఒకరు
- మంచిర్యాల జిల్లాలో ఇల్లు కూలి వృద్ధుడు మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్)
వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ములుగు జిల్లా మేడివాగు వరద ఉధృతిలో గురువారం ఇద్దరు అన్నదమ్ములైన మత్స్యకారులు అల్లం శివాజీ, యువరాజ్ గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం శివాజీ మృతదేహం లభ్యమైంది. యువరాజ్ ఆచూకీ కోసం వెతుకున్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయంలో ఒకరు గల్లంతయ్యారు. మానేరు మత్తడి దూకుతుండటంతో చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం రాగా, దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన కరుణాకర్ అనే ఓ వ్యక్తి నీటిలో దూకి గల్లంతయ్యాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలోని వాగులో గంగదేరి అంజయ్య (45) అనే చేపలు పట్టేందుకు దిగి గల్లంతయ్యాడు పోలీసులు డ్రోన్ కెమెరా ద్వారా అంజయ్యను గుర్తించి రక్షించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్పల్లి గ్రామంలో ఓ ఇంటి పైకప్పు కూలిపోవడంతో పోచయ్య (70) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా రాష్ట్రంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో వర్షం పడింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 13.మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరైన వరంగల్లో ఐదు రోజుల తర్వాత శుక్రవారం సూర్యుడు కనిపించడంతో ప్రజలు ఊరట చెందారు. అయితే అంతలోనే మళ్లీ ముసురు పట్టింది.