చెర్వుగట్టు అభివృద్ధికి మాస్టర్ప్లాన్
ABN , First Publish Date - 2020-03-16T09:48:38+05:30 IST
నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు అభివృద్ధిపై ఆశలు చిగిరిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఈ నెలాఖరున నల్లగొండ పర్యటనలో భాగంగా చెర్వుగట్టును
రూ.35 కోట్లతో అంచనా.. ఈ నెలాఖరున సీఎం నల్లగొండ పర్యటన
చెర్వుగట్టునూ సందర్శించే అవకాశం..?
చెర్వుగట్టు (నార్కట్పల్లి), మార్చి 15: నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు అభివృద్ధిపై ఆశలు చిగిరిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఈ నెలాఖరున నల్లగొండ పర్యటనలో భాగంగా చెర్వుగట్టును సందర్శిస్తే ఆలయ రూపురేఖలు మారే అవకాశం ఉంది. చెర్వుగట్టులో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.35 కోట్ల అంచనాతో అధికారులు మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. వీటిలో కొన్ని పనులకు సాంకేతిక ఆమోదం లభించి, పరిపాలనా ఆమోదానికి దేవాదాయ కమిషనర్కు పంపారు. సీఎం కేసీఆర్ ఈ నెలాఖరున చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి రానున్నట్లు తెలిసింది. శాసనసభ ఎన్నికల సందర్భంగా నల్లగొండలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న కేసీఆర్..
టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఇక్కడికి సచివాలయాన్ని తరలించి రూ.200 కోట్లు కేటాయించి, కుర్చీ వేసుకుని అభివృద్ధి పనులు చేసి చూపిస్తానని మాట ఇచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సీఎంను కలిసి ఈ వాగ్దానాన్ని ప్రస్తావించగా, ఈ నెలాఖరున నల్లగొండకు వస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రిని చెర్వుగట్టు దేవస్థానానికి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ సీఎం పర్యటిస్తే చెర్వుగట్టు రూపు రేఖలు మారుతాయని దేవస్థానానికి మహర్దశ పట్టనుందని భక్తులు భావిస్తున్నారు.