మాస్క్‌తో జాగ్రత్త సుమా!

ABN , First Publish Date - 2020-03-23T13:32:25+05:30 IST

వైద్యులు, కరోనా లక్షణాలున్న వారికి సేవలు అందించేవారు, తుమ్ములు, దగ్గులు ఉన్న వారు మాత్రమే మాస్క్‌లు ధరించాలి. మాస్క్‌ ధరించేందుకు శాస్త్రీయ విధానం ఉంది. మాస్క్‌ సరిగా ధరించకపోతే లాభం కంటే నష్టమే అధికం అన్నారు...

మాస్క్‌తో జాగ్రత్త సుమా!

కరోనా వైరస్‌ను నివారించేందుకు పలువురు మాస్క్‌లు ధరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలా? అసలు మాస్క్‌ ఎంత వరకు సేఫ్‌ అనే అంశాలపై ఊపిరితిత్తుల నిపుణులు డాక్టర్‌ నాగేశ్వరరావు ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.


వైద్యులు, కరోనా లక్షణాలున్న వారికి  సేవలు అందించేవారు, తుమ్ములు, దగ్గులు ఉన్న వారు మాత్రమే మాస్క్‌లు ధరించాలి. మాస్క్‌ ధరించేందుకు శాస్త్రీయ విధానం ఉంది. మాస్క్‌ సరిగా ధరించకపోతే లాభం కంటే నష్టమే అధికం అన్నారు ప్రముఖ ఊపిరితిత్తుల నిపుణుల డాక్టర్‌ నాగేశ్వరరావు. ఆయన ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో కూడా ప్రతి ఒక్కరూ మాస్క్‌ వేసుకోకూడదన్నారు. మాస్క్‌ లోపలి భాగంలో చేతులతో తాకినా, మాస్క్‌ వేసుకున్నాం కదా అని చేతులు శుభ్రంగా కడుక్కోకపోయినా నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మాస్క్‌ వేసుకున్నాక తరచూ దాన్ని తాకకూడదన్నారు. మాస్క్‌ వేసుకోవడం వల్ల కొంత అసౌకర్యం ఉంటుంది. దాంతో చాలామంది దాన్ని తరచూ అటు ఇటూ జరుపుతూ ఉంటారు. ఆ సమయంలో మన గోళ్లు నుంచి ఇన్‌ఫెక్షన్‌ ముక్కుల ద్వారా నేరుగా ఊపిరితిత్తులోకి చేరే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. శాస్త్రీయ పద్ధతిలో మాస్క్‌ వేసుకోకుంటే దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్నారు. ‘కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమావళిని పాటించాలి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తమ వరకూ రాదు అని ఎవరూ అనుకోకూడదు. పడవ మునిగేంత వరకూ చూస్తూ ఊరుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వైర్‌సను నివారించాలంటే మామూలు మాస్కులు కాదని, ఎన్‌-95 మాస్కులు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందని నాగేశ్వరరావు అంటున్నారు.

Updated Date - 2020-03-23T13:32:25+05:30 IST