మాస్క్ ఫోర్స్
ABN , First Publish Date - 2020-05-09T10:48:26+05:30 IST
కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ వినియోగించాలన్న ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంపై పోలీసులు దృష్టి సారించారు. మాస్క్ లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చే వారిని
![మాస్క్ ఫోర్స్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ వినియోగించాలన్న ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంపై పోలీసులు దృష్టి సారించారు. మాస్క్ లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చే వారిని గుర్తించేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మాస్క్ లేకుండా తిరిగే వ్యక్తులను గుర్తించనున్నారు. పరిమితికి మించి జనం ఒకేచోట గుమిగూడినా ఇట్టే పసిగట్టేస్తారు. దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ పోలీసులు ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ విధానం అమల్లోకి తెస్తున్నట్లు డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు.
ఇలా గుర్తిస్తారు..
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కాలనీలు, బస్తీల్లో స్థానికుల సహకారంతో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీటన్నింటినీ స్థానిక పోలీస్ ేస్టషన్లకు అనుసంధానం చేశారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మాస్క్ లేకుండా తిరిగే వారిని గుర్తిస్తున్నారు. అలాగే, ప్రధాన రోడ్లు, కూడళ్ల వద్ద ఉండే సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మొదట కౌన్సిలింగ్.. తర్వాత జరిమానా
పోలీస్ ేస్టషన్లో ఉండే కమాండ్ కంట్రోల్ నుంచి స్థానికంగా గస్తీలో ఉండే సిబ్బందికి మాస్క్ లేకుండా తిరిగే వారి వివరాలను అందిస్తారు. ఏ ప్రాంతంలో, ఏ సీసీ కెమెరాలో విజువల్ రికార్డైందో వివరిస్తారు. గస్తీ వాహనం క్షణాల్లోనే అక్కడకు చేరుకుంటుంది. మాస్కు లేని వారికి మొదటి సారి కౌన్సెలింగ్ ఇచ్చి వివరాల్ని నమోదు చేసుకుని పంపిస్తారు. అదే పనిగా మాస్క్ లేకుండా తిరుగుతూ పట్టుబడితే జరిమానా వసూలు చేస్తారు.