సుప్రీం కోర్టుకే మస్కా!

ABN , First Publish Date - 2020-12-27T07:41:19+05:30 IST

నిజాన్ని తాత్కాలికంగానే కప్పిపుచ్చగలమేమో గానీ.. శాశ్వతంగా కప్పేట్టేయడం అసాధ్యమనడానికి ఈ ఘటన నిదర్శనం.

సుప్రీం కోర్టుకే మస్కా!

న్యూఢిల్లీ, డిసెంబరు 26: నిజాన్ని తాత్కాలికంగానే కప్పిపుచ్చగలమేమో గానీ.. శాశ్వతంగా కప్పేట్టేయడం అసాధ్యమనడానికి ఈ ఘటన నిదర్శనం. అవినీతి, నమ్మకద్రోహం, కుట్ర నేరాల కింద సీబీఐ కొందరిపై కేసులు నమోదు చేసింది. దానిలో ఎస్‌.శంకర్‌ అనే వ్యక్తి ఏ5 నిందితుడు. కేసు విచారించిన హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. 2000 డిసెంబరు 31న నిందితులకు ఏడాది జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. దీనిపై శంకర్‌.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా సీబీఐ కోర్టు ఆదేశాలను సమర్థించింది.


దీంతో నిందితుడు.. సుప్రీం కోర్టుకెళ్లాడు. సీబీఐ కోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుందంటూ.. మొత్తం కేసునే ఆయన తనవైపు మలుపుతిప్పాడు. నిందితులకు వెయ్యి రూపాయల జరిమానా ‘లేదా’ ఏడాది జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు చెప్పిందని.. కానీ, హైకోర్టు మాత్రం రెండూ విధించినట్లుగా అర్థం చేసుకుందని సుప్రీంకు చెప్పాడు. అప్పటికే జరిమానా చెల్లించేశానని.. అందువల్ల కేసుల నుంచి విముక్తి కల్పించాలని కోరాడు. ఈ వాదనతో సుప్రీం ఏకీభవించింది. శంకర్‌కు రూ.వెయ్యి జరిమానా విధించి.. విడుదల చేస్తూ 2019 జూలై 23న తీర్పు చెప్పింది.


అదే సమయంలో.. అసలు.. ఈ కేసుపై పూర్తిగా పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని తన సెక్రటరీ జనరల్‌ను ఆదేశించింది. తన నివేదికలో సెక్రటరీ జనరల్‌ అసలు నిజాలను వెలుగులోకి తెచ్చారు. సీబీఐ కోర్టు తీర్పును వక్రీకరించడంతోపాటు తప్పుడు పత్రాలను సుప్రీంకోర్టుకు నిందితుడు సమర్పించాడని స్పష్టం చేశారు.

సుప్రీంను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినందుకు, కింది కోర్టు తీర్పును వక్రీకరించి సమర్పించినందుకు.. 2019నాటి తీర్పును పునఃసమీక్షించి.. తగు విధంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలంటూ నిందితుడు శంకర్‌కు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనురుద్ద బోస్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం షోకాజ్‌ నోటీసు జారీచేసింది. ఈ కేసులో నిందితుడు, న్యాయవాది.. ఇద్దరూ ఉమ్మడి ఏపీకి చెందినవారే.


Updated Date - 2020-12-27T07:41:19+05:30 IST