సూసైడ్ నోట్ రాసిన మారుతీరావు..

ABN , First Publish Date - 2020-03-08T16:06:03+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే...

సూసైడ్ నోట్ రాసిన మారుతీరావు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే  చింతల్‌బస్తీలో ఉన్న వైశ్య భవన్‌లో మారుతీరావు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మొదట వార్తలు వచ్చినప్పటికీ.. అపస్మారక స్థితిలో పడి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. విషం తాగి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు.


నోట్‌లో ఏముంది..!?

అయితే.. ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు సూసైట్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ‘తల్లీ అమృత అమ్మ దగ్గరికి వెళ్ళిపో....’ అని సూసైడ్ నోట్‌లో రాసి ఉన్నట్లు తెలిసింది. ఈ ఒక్క విషయమే కాదు.. అమృత గురించి ఇంకా చాలా విషయాలు ప్రస్తావించినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఆ నోట్‌ను బయటపెట్టకుండా గోప్యంగా ఉంచుతున్నారు.


అమృత స్పందన ఇదీ..

తన తండ్రి మారుతీరావు ఆత్మహత్యపై కుమర్తె అమృత స్పందించింది. ఈ ఆత్మహత్యపై ఇప్పుడే ఏం మాట్లాడలేనని చెప్పింది. ‘నాన్న ఆత్మహత్యపై నాకు క్లారిటీ లేదు. ఆత్మహత్య వ్యవహారంలో నిజానిజాలేంటి అనేది తెలియాల్సి ఉంది. అసలు ఎలా జరిగిందో తెలియదు. ఇప్పుడే ఏమీ స్పందించలేను. అన్ని వివరాలు తెలిసాక స్పందిస్తాను’ అని అమృత మీడియాకు వెల్లడించింది.

Updated Date - 2020-03-08T16:06:03+05:30 IST