లొంగుబాటలో గణపతి!

ABN , First Publish Date - 2020-09-01T08:03:25+05:30 IST

సీపీఐ (మావోయిస్టు) పార్టీ అగ్రనేత, మాజీ కార్యదర్శి గణపతి అలియాస్‌ ముప్పాల లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోయే

లొంగుబాటలో గణపతి!

  • అనారోగ్యంతో మావోయిస్టు నేత లొంగుబాటు నిర్ణయం
  • ప్రభుత్వంతో చివరి దశలో అనుయాయుల చర్చలు
  • తెలంగాణ పోలీసుల చొరవ.. మోదీ సర్కారు సుముఖం!
  • టీచరు నుంచి మావోయిస్టు పార్టీలోకి లక్ష్మణరావు
  • 43 ఏళ్లపాటు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు
  • వయోభారంతో రెండేళ్ల క్రితం బాధ్యతల నుంచి విరమణ


న్యూఢిల్లీ/జగిత్యాల, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): సీపీఐ (మావోయిస్టు) పార్టీ అగ్రనేత, మాజీ కార్యదర్శి గణపతి అలియాస్‌ ముప్పాల లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఆయన అనుయాయులకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు అంతిమ దశలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. 74 ఏళ్ల గణపతి రెండేళ్ల క్రితమే అనారోగ్య కారణాల వల్ల పార్టీ ఉన్నత పదవి నుంచి తప్పుకొన్నారు. ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, మధుమేహంతో తీవ్ర అస్వస్థతతో ఉన్న గణపతిని ఎక్కడికి తీసుకువెళ్లాలన్నా మోసుకుపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని, ఈ స్థితిలో లొంగిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందక తప్పదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గణపతి లొంగుబాటు సాఫీగా జరిగేలా చేసేందుకు తెలంగాణ పోలీసు అధికారులు చొరవ తీసుకుంటున్నారని, ఈ విషయంలో మోదీ సర్కారు కూడా సుముఖంగా ఉందని తెలిసింది. కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభం, చైనా దురాక్రమణ వంటి సమస్యల నేపథ్యంలో గణపతి లొంగిపోతే.. అది తమకు రాజకీయంగా ఉపయోగపడుతుందని మోదీ ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. కేసిఆర్‌ సర్కారు కూడా ఈ పరిణామాన్ని తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయవచ్చని తెలుస్తోంది. 


ఉపాధ్యాయుడిగా జీవితం మొదలుపెట్టి..

ముప్పాల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి.. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని మొదలుపెట్టి మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌లో ముప్పాల గోపాల్‌రావు-శేషమ్మ ద ంపతుల రెండో కుమారుడిగా 1950లో లక్ష్మణరావు జన్మించారు. ఆయనకు 1973లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా (అన్‌ ట్రెయిన్డ్‌) ఉద్యోగం వచ్చింది. రుద్రంగిలో పని చేస్తుండగా 1975లో బీఈడీ (ఇన్‌ సర్వీస్‌) సీటు రావడంతో వరంగల్‌కు వెళ్లారు. అక్కడ ఆర్‌ఎ్‌సయూతో ఆయనకు సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1977లో మేడిపల్లి మండలం గోవిందారంలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. 1977 సెప్టెంబరు 7న ఆదిలాబాద్‌ జిల్లా జన్నారం మండలం తపాల్‌పూర్‌లో పీతాంబర్‌రావు హత్య కేసులో కొండపల్లి సీతారామయ్యతో పాటు ఆయన పేరూ ఉంది. అప్పట్లో 16 మందిపై నమోదైన కేసులో ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి అలియాస్‌ రాధాకృష్ణ అలియాస్‌ మల్లన్న అనే పేరు ఉండటంతో తొలిసారి ఆయన మావోయిస్టు పార్టీలో చేరిన విషయం బయటికి వచ్చింది. 1977లో జగిత్యాల జైత్రయాత్ర కోసం చందాలు వసూలు చేశారనే కేసు, ఉప్పుమడిగె రాజేశ్వర్‌రావు, చిన్నమెట్‌పల్లి జగన్మోహన్‌రావు హత్య కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఆ తరువాత లక్ష్మణ్‌రావు కరీంనగర్‌లో బెయిల్‌ తీసుకుని అదే ఏడాది పూర్తి స్థాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1979లో జిల్లా కార్యదర్శిగా వ్యవహరించారు. 1990-91లో పీపుల్స్‌వార్‌ పార్టీలో చీలికలు రాగా, 2005లో నూతనంగా ఏర్పడ్డ మావోయిస్టు పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం ఆ బాధ్యతలు నిర్వర్తించారు. గణపతి తలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి వెల కట్టడం అప్పట్లో కొత్త చర్చకు దారి తీసింది. రెండేళ్ల క్రితం గణపతి స్థానంలో నంబాల కేశవరావును కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. గణపతికి భార్య విజయ, కుమారుడు వాసుదేవరావు ఉన్నారు.

Updated Date - 2020-09-01T08:03:25+05:30 IST