అర్ధరాత్రి చోరీకి యత్నం.. స్థానికులు వెంబడించడంతో పొదల చాటున దాక్కోబోయి..
ABN , First Publish Date - 2020-07-13T16:32:30+05:30 IST
మండలంలోని రాఘవపూర్లో పాడుబడిన బావిలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం విధితమే. ఆదివారం ఈ ఘటనకు సంబంధించి సీఐ రాజిరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
చోరీకి వచ్చి, బావిలో పడి యువకుడు మృతి
స్టేషన్ఘన్పూర్ (జనగామ) : మండలంలోని రాఘవపూర్లో పాడుబడిన బావిలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం విధితమే. ఆదివారం ఈ ఘటనకు సంబంధించి సీఐ రాజిరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి గ్రామంలోని డబుల్బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలోకి హైదరాబాద్కు చెందిన ఫరీద్ఖాన్తో పాటు మృతుడు ఉమర్ (28) చోరీ కోసం వచ్చారు. ఈ క్రమంలో వారిని గుర్తించి స్థానికులు అరుపులు వేయగా చుట్టుపక్కల ఉన్నవారు వెంబడించారు. దీంతో ఫరీద్ఖాన్ వాళ్లకు చిక్కాడు. ఉమర్ (మృతుడు) పరుగెత్తుకుంటూ వచ్చికాలనీకి సమీపంలోని పాతబావి చుట్టూ ఉన్న చెట్లపొదల మాటున దాక్కునే ప్రయత్నం చేయగా అందులో పడిపోయాడన్నారు. దీంతో స్థానికులు శనివారం బావిలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారన్నారు. కానిస్టేబుల్ గుంజ కుమారస్వామి క్రేన్ సహయంతో బావిలోకి దిగి శవాన్ని వెలికితీశాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు సీఐ వివరించారు.
ఫరీద్ఖాన్ను బైండోవర్ చేశాం..
రాఘవపూర్కు చోరీకి వచ్చి చిక్కిన ఫరీద్ఖాన్ను విచారించి అతడి వద్ద దొరికిన సెల్ఫోన్ను అదేరోజు గ్రామానికి చెందిన వ్యక్తికి అందించామన్నారు. అనంతరం ఫరీద్ను విచారించగా హైదరాబాద్లో పలు కేసుల్లో నిందితుడిగా గుర్తించామన్నారు. శనివారం తహసీల్దార్ విశ్వప్రసాద్ ఎదుట బైండోవర్ చేసి, హైదరాబాద్ క్రైమ్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.