మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి కూడా..?

ABN , First Publish Date - 2020-09-03T09:48:34+05:30 IST

సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్‌ సత్తన్న (69) ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లుగా వార్తలు

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి కూడా..?

పెద్దపల్లి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్‌ సత్తన్న (69) ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈయనది పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రాజులపల్లి గ్రామం. మంథనిలో 1975లో ఇంటర్‌ చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌యూలో చేరారు. కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యారు. వివాహమై ఒక కూతురు  జన్మించిన తర్వాత 1977లో అజ్ఞాతంలోకి వెళ్లి అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీలో చేరారు. మంథని, మహదేవ్‌పూర్‌ ఏరియా దళంలో పని చేసి క్రమంగా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. 1977లో ఆయనను ప్రస్తుత జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. బెయిల్‌పై వచ్చాక  ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. మహారాష్ట్రకు వెళ్లి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు.


1996-97లో ఆయనను పార్టీ కేంద్ర కమిటీలోకి తీసుకున్నది. 1986లో పూర్వ ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌పై దాడి జరిపి ఒక ఎస్‌ఐ, 12 మంది పోలీసులను కాల్చి చంపారు. ఖమ్మం జిల్లా కరకగూడెం పోలీస్‌ స్టేషన్‌పై మెరుపుదాడి జరిపి 16 మంది పోలీసులను హతమార్చారు. 2007 డిసెంబరులో కేరళలోని అంగన్‌మలైలో   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిపై 21 కేసులుండగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి కోర్టులో డిసెంబరు 18న, మంథని కోర్టులో డిసెంబరు 22న హాజరు పరిచారు. 14 రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు నెలల తర్వాత జైలు నుంచి విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Updated Date - 2020-09-03T09:48:34+05:30 IST