ఎల్ఆర్ఎ్సపై వ్యాజ్యాల్లో
ABN , First Publish Date - 2020-12-10T08:42:41+05:30 IST
అక్రమ లే అవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 31న తెచ్చిన జీవో 131ను సవాల్ చేస్తూ దాఖలైన బ్యాచ్ పిటిషన్లలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

5 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అక్రమ లే అవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 31న తెచ్చిన జీవో 131ను సవాల్ చేస్తూ దాఖలైన బ్యాచ్ పిటిషన్లలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 5 వారాలకు వాయిదా వేసింది. ఎల్ఆర్ఎస్ జీవోను సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కేపీరావు, ఎ.సూర్యప్రకాశ్ వేర్వేరుగా దాఖలు చేసిన 4 ప్రజాహిత వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత గడువు కావాలని స్పెషల్ జీపీ సంజీవ్కుమార్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం రెండు వారాల్లోగా కౌంటర్ వేయాలని సూచించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది 2 వారాల గడువుపై అభ్యంతరం చెబుతూ ఇంకా ముందుగా విచారణకు వేయాలని కోరారు. న్యాయవాది అనవసర జోక్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. కౌంటర్ వేయడానికి ప్రభుత్వానికి 5 వారాల గడువు ఇచ్చింది.