రైతులు, ప్రజలు ఆందోళన చెందొద్దు

ABN , First Publish Date - 2020-06-01T08:44:34+05:30 IST

మిడతల గురించి రైతులు, ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర పరిశీలన బృందం సభ్యులు స్పష్టంచేశారు. మిడతల నియంత్రణకు

రైతులు, ప్రజలు ఆందోళన చెందొద్దు

  • రాష్ట్ర పరిశీలన బృందం 
  • ఆదిలాబాద్‌, నిర్మల్‌ల్లో ఏరియల్‌ సర్వే


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

మిడతల గురించి రైతులు, ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర పరిశీలన బృందం సభ్యులు స్పష్టంచేశారు. మిడతల నియంత్రణకు ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించింది. బృందంలోని శాస్త్రవేత్తలు సునీత, రహమాన్‌, వరంగల్‌ సీసీఎఫ్‌ అక్బర్‌, మంచిర్యాల కలెక్టర్‌ భారతి హోలికేరి, రామగుండం పోలీసు కమిషనర్‌ వి.సత్యనారాయణకు ఆదిలాబాద్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన స్వాగతం పలికారు. అనంతరం ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మిడతల నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులకు కల్పించే అవగాహనపై ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాగా, తాము ప్రయాణిస్తున్న వాహనంపై ఓ మిడత వచ్చి వాలడంతో ప్రత్యేక బృందం కలవరపడింది. అయితే అది స్థానిక మిడతేనని గుర్తించారు. దీని వల్ల పంటలకు ఏ నష్టం ఉండదని తేల్చారు. 


నాగ్‌పూర్‌లో మిడతల దండు

మిడతల దండు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాకు చేరుకుంది. రెండు రోజుల క్రితం మొదలైన మిడతల దండు యాత్ర మౌదా, రాంటెక్‌ తాలూకాలతో పాటు చంద్రాపూర్‌ సమీపంలోని బండార ప్రాంతాలకు చేరినట్టు అధికారులు గుర్తించారు. పవర్‌ స్ర్పేయర్ల ద్వారా క్రిమి సంహారక మందు పిచికారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మిడతల దండు గడ్చిరోలి, ప్రాణహిత పరీవాహక ప్రాంతంతో పాటు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేశారు.

Updated Date - 2020-06-01T08:44:34+05:30 IST