సకలం బంద్
ABN , First Publish Date - 2020-03-16T09:03:56+05:30 IST
వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు విశ్రాంతి తీసుకుంటున్నాయి. సెలవులు కాని సెలవులతో బడులు మూతపడ్డాయి. బందైన గేట్లతో పార్కులు సేదతీరుతున్నాయి. గుడైనా పదిలం అనుకుంటే అదీ లేదు.
వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు విశ్రాంతి తీసుకుంటున్నాయి. సెలవులు కాని సెలవులతో బడులు మూతపడ్డాయి. బందైన గేట్లతో పార్కులు సేదతీరుతున్నాయి. గుడైనా పదిలం అనుకుంటే అదీ లేదు. అక్కడికి వెళ్లేందుకు భక్తులు సందేహిస్తుండటంతో ఆలయాల వద్దా జనం కనిపించడం లేదు! ప్రభుత్వ పరంగా జరగాల్సిన కార్యక్రమాలు, పార్టీల కార్యకలాపాలు కూడా రద్దవడమో.. వాయిదాపడటమో జరుగుతోంది. ఇలా కరోనా ప్రభావంతో సకలం బంద్ అయ్యాయి!
సభలు.. సమావేశాలు మత్ కరోనా
ప్రభుత్వం, రాజకీయ పార్టీల కార్యక్రమాలు.. సభలు.. విపక్షాలు, ప్రజాసంఘాలు చేసే ఆందోళన కార్యక్రమాలపైనా కరోనా ప్రభావం పడింది. షెడ్యూల్ ప్రకారం 20 వరకు శాసనసభ, మండలి సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే సోమవారంతో సమావేశాలను ముగించనున్నారు. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియమితుడైన బండి సంజయ్ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో స్వాగత సత్కారాలు భారీ స్థాయిలో ఉంటాయి. భారీ జనసమీకరణతో ఊరేగింపు నిర్వహిస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో బండి సంజయ్ స్వాగత కార్యక్రమాన్ని కుదించారు. అటు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. జనసమ్మర్దాన్ని అరికట్టేందుకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. వీహెచ్ తలపెట్టిన ధర్నాకు కూడా అనుమతి నిరాకరించారు.
భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ!
పెళ్లి వేడుకల్లో కనిపించని సందడి
కరోనా ప్రభావం పెళ్లిళ్లు, ఇతర వేడుకలపైనా పడుతోంది. ఫంక్షన్లు రద్దు కావడమో.. వాయిదా పడటమో జరుగుతోంది. వేడుకల్లోనూ జనం తక్కువగా ఉంటున్నారు. జనసమ్మర్దానికి దూరంగా ఉండేందుకు స్వీయనియంత్రణ పాటిస్తున్నారు. ఆహ్వానం అందితే వాట్స్పలో అభినందనలు చెప్పి మమ అనిపించేస్తున్నారు. దీంతో వేడుకలకు హాజరయ్యేవారి సంఖ్య 200 దాటడం లేదు. మహబూబ్నగర్ జిల్లా దోండ్లపల్లికి ఎంపిటీసీ అభిమన్యురెడ్డి, నిశిత వివాహం 11న జరిగింది. 16న రిసెప్షన్ జరగాల్సి ఉండగా కరోనా ప్రభావంతో వాయిదా వేశారు. మహబూబాబాద్లో ఆదివారం జరిగిన ఓ పెళ్లిలో అతిథులతో పాటు పురోహితుడు, వధూవరులు కూడా మాస్క్లు ధరించారు. 500 మందికి భోజనం ఏర్పాటు చేస్తే.. వధూవరుల తరఫున చెరో వంద మంది హాజరయ్యారు.
ఆడని బొమ్మ
రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల గేట్లకు తాళం
సినిమా ‘తెర’ లేవలేదు.. బొమ్మ ఆడలేదు.. అసలు సినిమా థియేటర్లే తెరుచుకోలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల గేట్లకు యాజమాన్యాలు తాళాలు వేశాయి. దీంతో రోజూ సందడిగా కనిపించే ఆ ప్రాంతాలన్నీ జనంలేక బోసిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్లో థియేటర్ల అడ్డా అయిన ఆర్టీసీ క్రాస్రోడ్స్ ప్రాంతం జనం లేక వెలవెలబోయింది. 17రోజుల పాటు టాకీ్సలు పనిచేయకున్నా తమ వద్ద పనిచేసే సిబ్బందికి వేతనాలను ఇస్తామని సుదర్శన్ 35ఎంఎం థియేటర్ మేనజర్ శ్రీనివాసరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. 31వ తేదీ వరకు సినిమా హాళ్లు మూసే ఉంచనుండటంతో ఈ సమయాన్ని థియేటర్లలో మరమ్మతులు, నవీకరణ, శుభ్రంచేసే పనులు జరిపేందుకు వినియోగించుకుంటున్నారు. నిర్మల్లో మాత్రం సినిమా థియేటర్లు పనిచేశాయి. సోమవారం నుంచి థియేటర్లు మూసివేస్తున్నామని నోటీసులను నిర్వాహకులు అతికించారు.
పార్క్లకు విశ్రాంతి
లుంబినీ, సంజీవయ్య, ఎన్టీఆర్ గార్డెన్స్ మూసివేత
రాష్ట్రంలో పర్యాటకరంగం స్తంభించిపోయింది. పచ్చని ఉద్యనవనాల్లో జంటగా వచ్చి సేదతీరే పర్యాటకులు లేక పార్కులు బోసిపోయాయి. జనసమ్మర్దాన్ని అరికట్టేందుకు ప్రధాన పార్కులను మూసివేశారు. ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన లక్నవరం, బొగత జలపాతాల సందర్శనకు ఆదివారం పర్యాటకులను అనుమతించలేదు. వీటి సందర్శనను కొన్నిరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ములుగు డీఎ్ఫవో తెలిపారు. రామప్ప, మేడారం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్లో లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ మెమోరియల్, సంజీవయ్య పార్కులను మూసివేశారు. సాయంత్రాల్లో వందల మందితో సందడిగా కనిపించే నెక్లె్సరోడ్, ట్యాంక్బండ్ పరిసరాల్లో అంతగా జనాలు కనిపించలేదు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్లోనూ జనాలు కనిపించలేదు. ఇక్కడి అతిథి గృహంలోని 36 గదులు కూడా మూడురోజులుగా ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లూ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో సంక్రాంతి సమయంలో మాదిరిగానే రోడ్లు కనిపిస్తున్నాయి.
భక్తుల దర్శనమే కరువాయె!
యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి వెలవెల
కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీదా పడింది. భద్రాద్రి, ఆలయంలో భక్తులు లేక క్యూలైన్లు ఖాళీగా కనిపించాయి. ఏపీలోని ఒంటిమిట్ట తరహాలోనే ఇక్కడా రాములోరి కల్యాణాన్ని ఆలయం వద్దే పరిమిత సంఖ్యలో భక్తుల మధ్య నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాదాద్రి ఆలయ పరిసరాల్లో ఆదివారం భక్తులు పలుచకగా కనిపించారు. క్యూలైన్లలో చేతులను శుభ్రం చేసుకునేందుకు నీటిని, శానిటరీ సామగ్రిని అందుబాటులో ఉంచారు. వేములవాడ ఆలయ ప్రాంగణం, వసతి గదులు, ప్రసాదం తయారీ ప్రాంతం, క్యూలైన్లను శుభ్రం చేస్తున్నారు. బాసరలో అక్షరశ్రీకారానికి వచ్చిన పిల్లల సంఖ్య రెండంకెలు దాటలేదు. ఏపీలోని తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలను రద్దు చేశారు.
విద్యార్థుల ఇళ్ల బాట
విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో హాస్టళ్లలోని విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు బడులు, కాలేజీలు, యూనివర్సిటీలకు సోమవారం నుంచి 31వరకు సెలవులు ప్రకటించారు. ఓయూ, తెలుగు యూనివర్సిటీ, జెఎన్టీయూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అర్కిటెక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీ, ట్రిపుల్ ఐటీల్లో జరిగే వివిధ కార్యక్రమాలు, స్పెషల్ క్లాస్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. హాస్టళ్లలో ఈసారి మెస్లనూ మూసేశారు. దీంతో అక్కడే ఉంటూ వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులు వంట చేసుకునేందుకు రైస్ కుక్కర్లు కొని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు యథాతథంగా హాస్టల్ వసతి కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పబ్బులు, బార్లు, పర్మిట్రూంలు బంద్
జనసమ్మర్దాన్ని అరికట్టేందుకు పబ్బులు, బార్లు, పర్మిట్రూంలనూ మూసివేత కూడా మొదలైంది. మంచిర్యాల జిల్లాలో 8బార్లను, 76 పర్మిట్ రూంలను మూసివేశారు. కుమ్రంభీం జిల్లాలో రెండు బార్లను మూసివేశారు. పాలమూరులో 11బార్లను క్లోజ్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా ఆదివారం ఇదే పరిస్థితి కనిపించింది. బార్లు, పర్మిట్రూంల మూసివేత ప్రభావంతో యాజమాన్యాలు లక్షల్లో నష్టపోతారనే విశ్లేషణలు ఉన్నాయి.
కరోనాకు ఐసిస్ హైరానా
యూరప్ వెళ్లొద్దు.. అక్కడివారు రావొద్దు
తమ ఉగ్రవాదులకు ప్రత్యేక సూచనలు
లండన్: కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసి్సకూ కరోనా భయం పట్టుకుంది. వైరస్ ప్రబలుతున్న కారణంగా అప్రమత్తంగా ఉండాలంటూ.. ఉగ్రవాదులకు ప్రత్యేకంగా ప్రయాణ మార్గదర్శకకాలను జారీచేసింది. యూరప్ దేశాలకు వెళ్లరాదంటూ తమ ఉగ్రవాదులకు ఐసిస్ హెచ్చరికలు చేసినట్లు ‘సండే టైమ్స్’ పేర్కొంది. ఇప్పటికే ఉగ్రవాద కార్యకాల పాల కోసం యూర్పలో తిష్ఠవేసిన ఉగవ్రాదులను ఆ ప్రాంతాలను విడిచి రావొద్దంటూ హుకుం జారీచేసింది. బయట నుంచి ఉగ్రవాదులెవ్వరూ యూర్పలో అడుగుపెట్టడం కానీ.. అక్కడున్నవారెవ్వరూ బయటకు రావొద్దని స్పష్టీకరిస్తూ ‘అల్-నబా’ న్యూస్లెటర్లో పేర్కొంది. తుమ్ములు, ఆవులింతల సమయాల్లో ప్రత్యేక జాగ్రతలు తీసుకోవాలని.. ఎప్పుడూ మాస్క్లు ధరించాలని సూచించింది.