అర్బన్ జిల్లా రెడ్జోన్
ABN , First Publish Date - 2020-05-02T10:02:34+05:30 IST
వరంగల్ అర్బన్ జిల్లా రెండోసారి కూడా రెడ్జోన్లోనే ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన
యథాస్థితి కొనసాగింపు
కొనసాగనున్న అంక్షలు
మరింత కఠినంగా లాక్డౌన్
హన్మకొండ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): వరంగల్ అర్బన్ జిల్లా రెండోసారి కూడా రెడ్జోన్లోనే ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ప్రకటనలో అర్బన్ జిల్లాను రెడ్జోన్గానే కొనసాగిస్తున్నట్టు తెలిపింది. తెలంగాణలో ప్రకటించిన ఆరు రెడ్జోన్లలో అర్బన్ జిల్లా కూడా ఉంది. మిగతావి హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చెల్, వికారాబాద్ జిల్లాలు. అయితే ఈ అయిదు జిల్లాలో గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కొనసాగుతుండగా వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పది రోజుల క్రితం పూరిగుట్ట, ఎర్రబెల్లిలలో నమోదైన రెండు పాజిటివ్ కేసులు మినహా ఆ తర్వాత కొత్తగా ఏమీ నమోదు కాలేదు. భూపాలపల్లి, జనగామ జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించారు. ఇక్కడ పరిమిత స్థాయిలో లాక్డౌన్ అమలవుతుంది. ములుగు, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాలు గ్రీన్జోన్ల పరిధిలోకి వచ్చాయి. ఈ జిల్లాల్లో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పగడ్బందీగా లాక్డౌన్..
తొలుత అర్బన్ జిల్లాలో 25 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దీనిని రెడ్జోన్గా ప్రకటించారు. అప్పటి నుంచి జిల్లాలో కరోనావైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం జిల్లా యంత్రాంగం నడుచుకుంటోంది. జిల్లాలోకి ప్రవేశించే అన్ని ప్రధాన రహదారులను మూసేశారు. లాక్డౌన్ను అత్యంత పగడ్బందీగా అమలు చేస్తున్నారు. ఫలితంగా కొత్త కేసుల నమోదు నిలిచి పోయింది. ఇంతలో పూరిగుట్టలో ఒక బాలికకు కరోనా పాజిటివ్ రావడంతో, ఆ వెంటనే ఆ బాలిక ప్రైమరీ కాంటాక్టుగా ధర్మసాగర్ మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన బాలుడికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. గతంలో పాజిటివ్ వచ్చిన 25 మందిలో చికిత్స అనంతరం 24 మంది డిశ్చార్జి అయ్యారు. ఇటీవల పాజిటివ్ వచ్చిన ఇద్దరితో పాటు మరొకరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాలు జిల్లాలో ఒక్కటి కూడా లేదు. అయినా కేంద్రం రెడ్జోన్లోనే ఉంచడంతో జిల్లా ప్రజలు నిరాశ చెందుతున్నారు.
రెడ్జోన్ అంటే?
రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిని కొన్ని ప్రాతిపదికలపై విభజించింది. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ జిల్లాలను రెడ్ జోన్గా పరిగణిస్తారు. ఆ జిల్లాల్లో ఎటువంటి కార్యకలాపాలను, రాకపోకలను అనుమతించరు. వాహనాల రాకపోలపై మరింత కఠిన తరమైన ఆంక్షలను అమలు చేస్తారు. ఆరెంజ్జోన్, గ్రీన్ జోన్లకు ఉన్న వెసులుబాటు వీటికి ఉండదు. రెడ్జోన్ పరిధిలోని ప్రజలందరు సడలింపులు ఇచ్చే వరకు ఇళ్ళలోనే ఉండాల్సి ఉంటుంది.