ఈ స్థలం నాది.. రేపట్నుంచి పనులు మొదలు పెడతా!

ABN , First Publish Date - 2020-05-11T15:07:35+05:30 IST

లాక్‌డౌన్‌లో అందరూ ఇళ్లకే పరిమితమైతే..

ఈ స్థలం నాది.. రేపట్నుంచి పనులు మొదలు పెడతా!

హైదారాబాద్/యూసుఫ్‌గూడ : లాక్‌డౌన్‌లో అందరూ ఇళ్లకే పరిమితమైతే కబ్జారాయుళ్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు శనివారం రాత్రి ప్రయత్నించారు. యూసుఫ్‌గూడ డివిజన్‌ పరిధి వెంకటగిరి స్రవంతినగర్‌లో 650 గజాల ఖాళీ స్థలం ఉంది. ఇది ప్రభుత్వ స్థలమని రెవెన్యూ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో నంబరు లేని కారులో ఒకరు, ఇద్దరు పనివాళ్లను తీసుకుని అక్కడికి వచ్చాడు. ప్రభుత్వ స్థలం అని ఉన్న బోర్డు ను తొలగించి, పక్కన పడేశాడు. 


స్థానికులు గమనించి ప్రశ్నించగా.. ‘ఈ స్థలం నాది.. రేపటి నుంచి ఇక్కడ పనులు మొదలు పెడతాను’ అంటూ సమాధానం ఇచ్చాడు. రాత్రి వేళ వచ్చి బోర్డు తొలగించడం ఏమిటని అడిగితే.. ‘ఇప్పుడే పని వారు దొరికారు.. అందుకే వచ్చానని చెప్పి వెళ్లాడు. ఈ విషయమై కాలనీ అసోసియేషన్‌ వారు షేక్‌పేట తహసీల్దార్‌కు సమాచారం అందించడంతో పాటు, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ స్థలాన్ని కాలనీ అవసరాలకు ఉపయోగించాలని ఎంతో కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ఖాళీగా ఉండటంతో కబ్జారాయుళ్ల కళ్లు దానిపైనే ఉన్నాయని కాలనీ అసోసియేషన్‌ నాయకులు జోబిరెడ్డి, ధర్మేందర్‌రెడ్డి, శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - 2020-05-11T15:07:35+05:30 IST