లాక్‌డౌన్ ఎఫెక్ట్..వెల్దండలో దీనస్థితిలో బ్రాహ్మణ కుటుంబం

ABN , First Publish Date - 2020-05-24T16:52:50+05:30 IST

కరోరా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.

లాక్‌డౌన్ ఎఫెక్ట్..వెల్దండలో దీనస్థితిలో బ్రాహ్మణ కుటుంబం

నాగర్ కర్నూల్ జిల్లా: కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే ఈ లాక్ డౌన్ నిరుపేదల జీవితాలను ఛిద్రం చేస్తోంది. ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. నిరుపేదలు అన్నమో రామచంద్ర అని అలమటించినా, కొంతమంది ఆపన్న హస్తం అందించినా అలాంటి సాయం అందుకునేందుకు ఆత్మాభిమానం అడ్డొచ్చి మరికొందరు నిరుపేదల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. లాక్ డౌన్‌తో నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో ఓ బ్రాహ్మణ కుటుంబం దీనస్థితి కలచివేస్తోంది.


వెల్దండలో నివాసం ఉంటున్న గిరిధర్, శారద దంపతుల కుటుంబంలో అందరూ అంథులే. వారు ఏ పని చేయాలన్న ఎవరో ఒకరి సహాయం తీసుకోవాల్సిందే. ఇంటిపెద్ద గిరిధర్ రావుకు ఐదేళ్ల వయసులోనే అంథత్వం వచ్చింది. తన మేనమామ కుమార్తె శారదను పెళ్లి చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు వారంతా పాక్షికంగా అంథులే. గిరిధర్ కుటుంబ పోషణ కోసం కొన్నాళ్లు సురభివారి నాటకాలు వేశారు... ఆల్ ఇండియా రేడియోలో సంగీత కచేరీలు చేసేవారు. కానీ వయసు పైబడడంతో ఇంట్లోనే ఉంటూ సంగీత పాఠాలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు.


గిరిధర్ పెద్ద కుమారుడు తిరుమలరావు హైదరాబాద్‌లో ఓ కంపెనీలో పనిచేస్తూ.. కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. చిన్న కుమారుడు నాగేశ్వరరావు సంపాదనే వారికి ఆధారమైంది. కుమార్తెలకు పెళ్లిళ్లుచేసినా వారు అంథులుగా మారడంతో భర్తలు దూరంపెట్టారు. దీంతో వారు పుట్టింటికి చేరుకున్నారు. కుటుంబంలో ఇంతమంది అంథులుగా ఉన్నా వారిలో గిరిధరరావుకు మాత్రమే ప్రభుత్వం పెన్షన్ వస్తుంది. దీంతో పూట గడవడం కష్టంగా మారిపోయింది. రెండో కుమారుడు నాగేశ్వరరావు అర్చకత్వంతో వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా భక్తులు ఆలయాలకు రాకపోవడంతో వచ్చే ఆదాయం కూడా ఆగిపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నా.. ఆత్మాభిమానంతో చేయి చాచేందుకు అంగీకరించడంలేదు. అయితే ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Updated Date - 2020-05-24T16:52:50+05:30 IST