రోగుల రక్షణకూ చట్టం చేయాల్సింది: కేకే
ABN , First Publish Date - 2020-09-20T06:52:14+05:30 IST
కరోనా రోగుల నుంచి ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు అధిక ఫీజులను బలవంతంగా వసూలు చేస్తున్నాయని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.

న్యూఢిల్లీ, సెప్టెంబరు19(ఆంధ్రజ్యోతి): కరోనా రోగుల నుంచి ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు అధిక ఫీజులను బలవంతంగా వసూలు చేస్తున్నాయని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆరోపించారు. సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్లోని ఒక ఆస్పత్రిలో ఒక బాధితుడి నుంచి ఏకంగా రూ.90లక్షలు వసూలు చేశారని సభ దృష్టికి తెచ్చారు.
‘‘ఆసుపత్రుల్లో శవాల విషయమే తీసుకోండి. నేనో ఆస్పత్రికి వెళ్లినపుడు అక్కడ శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమో, రాష్ట్ర ప్రభుత్వమో, మరో ఏజెన్సీయో వాటిని చేపట్టే విధంగా యంత్రాంగం ఉండాలి’’ అని సూచించారు. లాక్డౌన్ సమయంలో కేంద్రం తప్పిదాలను కేకే ప్రస్తావించారు. వలస కార్మికులకు సొంత ఊరికి వెళ్లేందుకు సమయం ఇవ్వకుండా లాక్డౌన్ ప్రకటించారని మండిపడ్డారు.
రాష్ట్రాలు డీల్ చేయాల్సిన అంశాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినపుడు రాష్ట్రాలతో మాట్లాడాలని సూచించారు.