భూ వివాదంలో తలదూర్చిన సీఐ, ఎస్సైలపై చర్యలు
ABN , First Publish Date - 2020-07-19T08:47:34+05:30 IST
రియల్టర్ల భూ తగాదాలో తల దూర్చినందుకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సీఐ ఏవీ రంగ, మోత్కూరు ఎస్సై సీహెచ్ హరిప్రసాద్పై సీపీ మహేష్ భగవత్....

మోత్కూరు, జూలై 18: రియల్టర్ల భూ తగాదాలో తల దూర్చినందుకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సీఐ ఏవీ రంగ, మోత్కూరు ఎస్సై సీహెచ్ హరిప్రసాద్పై సీపీ మహేష్ భగవత్ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. వారిని రాచకొండ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. నల్లగొండ జిల్లా అమ్మనబోలులో కాసం సత్యనారాయణ వద్ద మోత్కూరు మండలం కొండగడపకు చెందిన అంబటి నర్సయ్య, బండ యాదయ్య తదితరులు 10.2 ఎకరాల భూమిని చేర్యాలకు చెందిన పెద్ది ప్రశాంత్కు విక్రయించారు. అయితే, అగ్రిమెంటు ప్రకారం ప్రశాంత్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో వారి మధ్య తగదా జరుగుతోంది. ఇదిలా ఉండగా, అంబటి నర్సయ్య, అతని పాలివారు అంబటి చంద్రయ్య, పురుషోత్తం మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారు పోలీ్సస్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. ఆ తర్వాత రాజీకి యత్నించగా, సీఐ, ఎస్ఐ జోక్యం చేసుకుని అమ్మనబోలు భూ తగాదా పరిష్కరించుకుంటేనే ఈ కేసు రాజీ కుదురుతుందని లింక్ పెట్టి కేసు కొట్టి వేయకుండా చేశారు. ఈ విషయమై అంబటి నర్సయ్య సీపీకి ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టి సీఐ, ఎస్సైలపై సీపీ చర్యలు తీసుకున్నారు.