పరిశ్రమలకు అండగా ఉన్నాం
ABN , First Publish Date - 2020-07-10T08:54:56+05:30 IST
పరిశ్రమలకు అండగా ఉన్నాం

కరోనా సంక్షోభంలోనూ చేయూత.. పెట్టుబడులకు రాష్ట్రంలో అపార అవకాశాలు.. యూఎ్సఐబీసీ ఇన్వె్స్టమెంట్ వెబినార్లో కేటీఆర్
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలబడుతోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్లో గురువారం జరిగిన యూఎ్సఐబీసీ ఇన్వె్స్టమెంట్ వెబినార్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన విశ్లేషించారు. భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ కంపెనీలు స్థూలంగా దేశాన్ని ఒక యూనిట్గా కాకుండా.. తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ఒక యూనిట్గా తీసుకోవాలని సూచించారు. గత ఆరు సంవత్సరాల్లో దేశంలోని అనేక రాష్ట్రాల కన్నా భిన్నంగా తెలంగాణ తనదైన శైలిలో పెట్టుబడులను ఆకర్షిస్తూ వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన టీఎ్స-ఐపాస్ విధానంతో పదిహేను రోజుల్లోనే అన్ని రకాల పెట్టుబడులకు అనుమతులు ఇస్తున్నామని, ఇప్పటికే ఈ విధానం విజయవంతం అయిందని చెప్పారు. అనుమతులు ఇచ్చిన వాటిలో 80శాతానికి పైగా కార్యకలాపాలను ప్రారంభించినట్టు పెట్టుబడిదారులకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్స్. ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి 14 ప్రాధాన్య రంగాలుగా గుర్తించిందని, వీటిలో పెట్టుబడులు పెట్టేవారికి సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగానికి సంబంధించి బలమైన ఎకో సిస్టం ఇక్కడ ఉందని, ప్రస్తుతం అమెరికా వంటి అగ్ర రాజ్యం సైతం ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేసే కరోనా మందుల పైన ప్రధానంగా ఆధారపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతో పాటు అనేక ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత అతి పెద్ద ప్రాంగణాలను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. భారతదేశంలోనే అతి పెద్ద మెడికల్ డివైస్ పార్క్ తెలంగాణలో ఉందని, ఈ రంగంలోనూ అద్భుతమైన పెట్టుబడి అవకాశాలున్నాయని అన్నారు. ఇన్వె్స్టమెంట్ వెబినార్లో పాల్గొన్న అమెరికన్ కంపెనీల అధినేతలు తెలంగాణలో ఉన్న వాతావరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా టీఎ్స-ఐపాస్ విధానం, ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న మద్దతును తెలంగాణ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల అధినేతలు ప్రశంసించారు.