మిగులు జలాల వాడకంపై.. నేడు కృష్ణా బోర్డు సాంకేతిక కమిటీ భేటీ
ABN , First Publish Date - 2020-05-13T09:15:45+05:30 IST
కృష్ణా బేసిన్లో మిగులు జలాలను తెలుగు రాష్ట్రాలు ఎలా వినియోగించుకోవాలో తేల్చేందుకు బోర్డు సాంకేతిక కమిటీ బుధవారం సమావేశం కానుంది.

- రెండు రాష్ట్రాల వినియోగ విధానంపై నిర్ణయం!
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిటీ చర్చ
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్లో మిగులు జలాలను తెలుగు రాష్ట్రాలు ఎలా వినియోగించుకోవాలో తేల్చేందుకు బోర్డు సాంకేతిక కమిటీ బుధవారం సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ నుంచి కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. కమిటీకి చైర్మన్గా కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అంతరాష్ట్ర సీఈలు, సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం డైరెక్టర్, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఉన్నారు. కృష్ణా బేసిన్లోని నికర జలాల్లో ఏపీ, తెలంగాణకు కలిపి 811 టీఎంసీలను కేటాయించగా.. ఇందులో తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంటుంది.
అయితే కొన్నిసార్లు, ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరదలతో కృష్ణా బేసిన్లో 811 టీఎంసీల నికర జలాల కంటే ఎక్కువ నీటి లభ్యత అందుబాటులో ఉంటుంది. దీనినే మిగులు జలాలుగా పేర్కొంటున్నారు. ఈ మిగులు జలాలను ఏ రాష్ట్రం ఎంత శాతం ఉపయోగించుకోవాలన్నది ఇప్పటివరకూ ఖరారు కాలేదు. దాంతో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలి సమావేశం బుధవారం జరగనుంది.
బోర్డు సభ్యుడిగా రజత్కుమార్
కృష్ణా, గోదావరి బోర్డుల్లో పరిపాలన సభ్యుడిగా తెలంగాణ ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్కుమార్ను నియమించారు.ఈ స్థానంలో ఇంతకుముందు సోమేశ్కుమార్ ఉన్నారు. తెలంగాణ తరఫున బోర్డుల పరిపాలన సభ్యుడిగా రజత్కుమార్ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.