20న కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం
ABN , First Publish Date - 2020-09-16T09:22:49+05:30 IST
వరద జలాల వాడకంపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశం కావాలని కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది.

హైదరాబాద్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): వరద జలాల వాడకంపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశం కావాలని కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. ఈ నెల 20న జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇరు రాష్ట్రాల అధికారులకు బోర్డు సమాచారం ఇచ్చింది. కృష్ణా నదిలో అందుబాటులో ఉండే మిగులు, వరద జలాల వాడకంపై ఇప్పటి వరకు ఎలాంటి పద్ధతి లేదు. ప్రస్తుతం నదిలో భారీగా వరద నీరు ఉండడంతో నెల రోజులకు పైగా కృష్ణాలో ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు అవసరమైన నీటిని కూడా తరలిస్తున్నారు. అయితే వరదల సమయంలో రాష్ట్రాలు తీసుకుంటున్న నీటిని లెక్కల్లోకి తీసుకోవాలా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. అలాగే ఈ వరద నీటిలో ఏ రాష్ట్రం ఎంత శాతం ఉపయోగించుకోవాలి? అనే విషయాన్ని కూడా ఖరారు చేయలేదు.