పీవీకి భారతరత్న ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-08-09T08:10:58+05:30 IST
దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు దేశానికి ఆణిముత్యమని, ఆ మహనీయుడికి భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు (కేకే) కేంద్రాన్ని కోరారు...
- ఆయన దేశానికే ఆణిముత్యం..
- దేశమంతటా పీవీ విగ్రహాలు ఉండేలా చూస్తాం
- పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేకే
(ఆంధ్రజ్యోతి రంగారెడ్డి అర్బన్): దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు దేశానికి ఆణిముత్యమని, ఆ మహనీయుడికి భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు (కేకే) కేంద్రాన్ని కోరారు. పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా మొయునాబాద్ మండలం తోల్కట్టలో పీవీ విగ్రహాన్ని కేకే ఆవిష్కరించారు. స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ, స్వామి రామానంద తీర్థ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, పీవీ కుమార్తె సురభి వాణీదేవి, పీవీ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. పీవీ రాజకీయ చాణక్యుడని,ఆయన దేశానికి చేసిన సేవలను మరువలేనివని అన్నారు.
దేశంలో ఆనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన విగ్రహాలను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర, దేశం, అంతర్జాతీయ స్థాయిలో, పార్లమెంట్, అసెంబ్లీ, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసేలా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పీవీ పోస్టల్ స్టాంపును త్వరలో విడుదల చేస్తామన్నారు. పీవీ విజయాలను, ఆయన రచనలను పుస్తకరూపంలో విస్తరింపజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పీవీ చేపట్టిన విద్యాశాఖను సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో తాను చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.